యెమెన్లో ఇరాన్ అనుకూల హౌతీలు ఎర్ర సముద్రం దగ్గర ఆధిపత్యాన్ని విస్తరిస్తుండటంతో సౌదీ అరేబియా అప్రమత్తమైంది. హౌతీలను ఎదుర్కొనేందుకు మరింత సమర్థవంతమైన నిఘా వ్యవస్థ అవసరమని సౌదీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి ఇంటెలిజెన్స్ సహాయం కోరినట్లు ప్రాంతీయ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ద్వారా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా సైనిక జోక్యం చేసుకోనుందా లేదా ఆపరేషనల్ సపోర్ట్ అందించిందా అనేది ఇంకా వివరాలు బయటకు రాలేదు.
సౌదీలో టెన్షన్
ఎర్ర సముద్ర తీరంలో హౌతీల దూకుడు సౌదీ అరేబియాకు కొత్త సవాళ్లు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 11న బాబ్ అల్-మందెబ్ జలసంధిలోని పెరిమ్ ద్వీపాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అలాగే రెడ్ సీ తీరంలోని మొఖా పోర్టును కూడా తమ ఆధీనంలోకి తీసుకుని, కీలక సముద్ర మార్గం చుట్టూ తమ ఉనికిని మరింత విస్తరించినట్లు సమాచారం. ఇదే సమయంలో యెమెన్లో సౌదీ మద్దతు ఉన్న బలగాలు కూడా కొన్ని ప్రాంతాల్లో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. దీంతో హౌతీల సైనిక కదలికలను ముందుగానే గుర్తించడం, భవిష్యత్ దాడులను అంచనా వేయడం సౌదీకి అత్యవసరంగా మారింది.
ఇజ్రాయెల్తో నేరుగా సంబంధాలు లేకున్నా..
ప్రాంతీయ దౌత్య వర్గాల సమాచారం ప్రకారం.. హౌతీల సైనిక మోహరింపులు, ఆయుధాల కదలికలు, భవిష్యత్ దాడులకు సంబంధించిన సన్నాహాలను గుర్తించేందుకు అవసరమైన ఇంటెలిజెన్స్ను పొందే ఉద్దేశంతో సౌదీ అరేబియా.. CENTCOM ద్వారా ఇజ్రాయెల్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్కు మధ్య ప్రస్తుతం అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అయినప్పటికీ ఇరాన్, దాని మద్దతు ఉన్న ప్రాంతీయ సాయుధ సంస్థల నుంచి ఎదురవుతున్న ముప్పు విషయంలో ఇరు దేశాల భద్రతా ప్రయోజనాల్లో కొంత సారూప్యత ఉంది. రెడ్ సీ వాణిజ్య, నౌకాయాన మార్గాల భద్రత కూడా రెండు దేశాలకు కీలక అంశమే. అయితే ఇజ్రాయెల్ నుంచి సౌదీకి ప్రత్యక్ష సైనిక సహాయం అందుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదు.
బాబ్ అల్-మందెబ్పై హౌతీల పట్టు..
హౌతీలు బాబ్ అల్-మందెబ్ సమీపంలో తమ ఉనికిని పెంచుకోవడం యెమెన్కు మాత్రమే పరిమితమైన అంశం కాదు. రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో కలిపే ఈ ఇరుకైన సముద్ర మార్గం ప్రపంచంలోని అత్యంత కీలకమైన నౌకాయాన మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్యం, యూరప్, ఆసియా మధ్య జరిగే అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం ఎంతో కీలకం. హౌతీల దాడుల ముప్పు పెరగడంతో నౌకలకు బీమా, భద్రత, రవాణా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్య నౌకలు ప్రస్తుతం ఈ జలమార్గాన్ని పూర్తిగా వదిలిపెట్టకపోయినా.. భద్రతా పరిస్థితులపై ఆందోళనలు మాత్రం పెరుగుతున్నాయి. మరోవైపు సోమవారం హౌతీలు సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్ ప్రాంతంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు ప్రకటించారు. దీంతో సౌదీ దక్షిణ ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు.
హౌతీల ముప్పుతో పాటు సౌదీ అరేబియాకు మరో కీలక సమస్య ఎదురైంది. సెప్టెంబర్ 11న రియాద్, మదీనా ప్రాంతాల్లోని ఈస్ట్-వెస్ట్ చమురు పైప్లైన్పై డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో నష్టం ఎంతమేర జరిగిందో అంచనా వేసేందుకు సౌదీ అధికారులు కొంతకాలం పైప్లైన్ కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ పైప్లైన్ గతంలో రోజుకు సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల బ్యారెళ్ల ముడి చమురును తరలించేది. అయితే ఆగస్టులో ఈ ప్రవాహం రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్లకు తగ్గినట్లు రాయిటర్స్ పేర్కొంది.
హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడిన సమయంలో సౌదీకి ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ మరింత కీలకంగా మారింది. ఇప్పుడు దానిపై దాడులు జరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంతరాయం కొనసాగితే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 4 శాతం వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. యన్బు ప్రాంతంలోని నిల్వలు కూడా ఐదు నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే ఎగుమతులను కొనసాగించేందుకు సరిపోవచ్చని పేర్కొంది.
అమెరికా వైపు చూస్తున్న సౌదీ
హౌతీల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా నుంచి మరింత భద్రతా సహాయం కోరుతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14న జెడ్డాలో CENTCOM కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్తో ఆయన సమావేశమైనట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే హౌతీలపై ప్రత్యక్షంగా అమెరికా దాడులు చేసేందుకు వాషింగ్టన్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదని సమాచారం. అదే సమయంలో సౌదీ అరేబియాకు ఇంటెలిజెన్స్ షేరింగ్, టార్గెటింగ్ సాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
ఇదిలా ఉంటే బాబ్ అల్-మందెబ్ ప్రాంతంలో ముప్పును ఎదుర్కోవడంతో పాటు చమురు మౌలిక వసతుల రక్షణ కోసం సౌదీ అరేబియా బ్రిటన్ సహాయాన్ని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. సౌదీకి సైనిక సలహాదారులను పంపేందుకు బ్రిటన్ అంగీకరించినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే.. రెడ్ సీ తీరంలో హౌతీల ఆధిపత్యం పెరగడం, సౌదీ భూభాగం, చమురు మౌలిక వసతులపై దాడులు తీవ్రం కావడంతో రియాద్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్తో పాటు ఇజ్రాయెల్ నుంచి కూడా నిఘా సహాయం పొందేందుకు సౌదీ ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాల్లో కీలక పరిణామంగా మారాయి.

