రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్ర ఉధృతం అవుతోంది. గత కొద్దిరోజులుగా రెండు దేశాలు భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. నిన్న రష్యా భీకర దాడులు చేయగా.. తాజాగా ఉక్రెయిన్ కూడాభారీ చేసింది. సెయింట్ పీటర్స్బర్గ్ చమురు టెర్మినల్, పోర్టుపై లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విడుదల చేశారు.
రష్యాలోని రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్, పరిసర లెనిన్గ్రాడ్ ప్రాంతాలపై శుక్రవారం అర్ధరాత్రి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో చమురు నిల్వ కేంద్రాలు, పోర్టు మౌలిక వసతులు లక్ష్యంగా మారినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జెలెన్స్కీ ఎక్స్లో చేసిన పోస్టులో.. సెయింట్ పీటర్స్బర్గ్లోని చమురు మౌలిక వసతులతో పాటు క్రోన్స్టాడ్ ప్రాంతంలోని కీలక సైనిక స్థావరంపై కూడా విజయవంతంగా దాడులు జరిగాయని తెలిపారు. ‘‘రష్యా యుద్ధ యంత్రాంగానికి ఆదాయం తెచ్చిపెడుతున్న పోర్టు చమురు మౌలిక వసతులను మా రక్షణ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. క్రోన్స్టాడ్లోని కీలక సైనిక లక్ష్యాలపై కూడా విజయవంతమైన దాడులు చేశాం.’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ దూరం సుమారు 850 కిలోమీటర్లు అని గుర్తుచేస్తూ.. ఇంత దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించిన ఉక్రెయిన్ సైన్యాన్ని అభినందించారు.
రష్యా
సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ మాట్లాడుతూ.. తాజా డ్రోన్ దాడిలో నగరంలోని ఆయిల్ టెర్మినల్ దెబ్బతిన్నట్లు వెల్లడించారు. అటు లెనిన్గ్రాడ్ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ డ్రోజ్డెంకో ప్రకారం.. ఉక్రెయిన్ డ్రోన్ వైసోట్స్క్ పోర్టును కూడా లక్ష్యంగా చేసుకుంది. ఈ పోర్టు ద్వారా చమురు, ధాన్యం, బొగ్గు, ద్రవీకృత సహజవాయువు (LNG) రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఉక్రెయిన్ రష్యా చమురు మౌలిక వసతులపై దాడులను మరింత తీవ్రతరం చేసింది. గత వారం దక్షిణ రష్యాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీల్లో ఒకదానిపై జరిగిన డ్రోన్ దాడితో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు కూడా జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘‘రష్యాలోని రెండు కీలక ఆయిల్ రిఫైనరీలను మా దీర్ఘశ్రేణి దాడులు విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నాయి.’’ అని తెలిపారు.
రష్యాలో ఇబ్బందులు
ఉక్రెయిన్ వరుస దాడుల కారణంగా రష్యాలో ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏర్పడటంతో పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఇంధన రేషన్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం.
గత నెలలో రష్యా రాజధాని మాస్కోపై కూడా ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. అప్పట్లో కనీసం 60 ఉక్రెయిన్ డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకటించారు. అయితే ఒక డ్రోన్ మాస్కో ఆయిల్ రిఫైనరీలోని ఓ సదుపాయాన్ని దెబ్బతీసినట్లు కూడా ఆయన వెల్లడించారు. తాజా దాడులతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి కీలక మలుపు తిరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు మౌలిక వసతులపై వరుస దాడులు రష్యా ఆర్థిక వ్యవస్థతో పాటు యుద్ధ సామర్థ్యంపైనా ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
Last night, our Ukrainian long-range sanctions against Russia over this war reached targets near St. Petersburg. Ukraine's Defense Forces struck port oil infrastructure that generates revenue for Russia's war, and there were also successful strikes on Kronstadt – an important… pic.twitter.com/bMHY3cL3rM
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) July 4, 2026

