ఆకాశంలో వింత చోటుచేసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఆకాశం రక్తవర్ణంలోకి మారిపోయింది. ఈ వింతైన సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. అచ్చం హాలీవుడ్ సినిమా మాదిరిగా వాతావరణం మారిపోయింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైనా ప్రళయం సంభవిస్తోందేమో అని ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉదయాన్నే ప్రజలకు వింతైన వాతావరణం దర్శనమిచ్చింది. ఉదయాన్నే నిద్ర లేచిన వారంతా వింతైన దృశ్యాలు చూసి భయకంపితులయ్యారు. ఎటుచూసినా ఎర్రటి ఆకాశం కనిపించింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక అందరిలో వణుకు పుట్టింది. ప్రపంచం అంతం అయిపోతుందా? అన్నట్టుగా వాతావరణం కనిపించగానే హడలెత్తిపోయారు. దీంతో పశ్చిమ ఆస్ట్రేలియాలోని షార్క్ బే, డెన్హామ్ ప్రజలకు ఉదయం ఒక పీడకలగా మారిపోయింది.
ఎప్పటిలాగానే శనివారం ఉదయం సూర్యుడు ఉదయించాడు.. కానీ అంతలోనే వెలుగు మాయమైంది. ఒక్కసారిగా ఎరుపు రంగుగా మారిపోయింది. ఎటుచూసినా ఎర్రగానే కనిపించింది. ఇళ్లు, రోడ్లు, వాహనాలు, చివరికి సముద్ర తీరం కూడా ఎర్రటి దుప్పటితో కప్పేసింది. దీంతో ప్రళయం రాబోతుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలంతా బయటకు వచ్చి వింతగా వీక్షించారు. మరికొందరు బెంబేలెత్తిపోయారు.
అసలేం జరిగిందంటే..
మార్చి 27న ఉష్ణమండల తుఫాను నరెల్లే ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను తీరాన్ని తాకబోతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎడారిలో ఇనుము సమృద్ధిగా ఉండటంతో ఎర్రటి మట్టిని మేఘంలా మార్చి ఆకాశంలోకి ఎగరగొట్టింది. దీంతో ఉదయాన్నే సూర్యరశ్మి సూక్ష్మ ధూళి కణాలపై పడడడంతో ఒక్కసారిగా ఆ దృశ్యమంతా రక్తవర్ణంలోకి మారిపోయింది. ఆకాశం ఎర్రగా మారడం వెనుక ఉన్న రహస్యం ఇదేనని నిపుణులు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలైన ఊహాగానాలు మొదలయ్యాయి. చాలా మంది భయాందోళనలతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. అధికారులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా కూడా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు సమాచారం.
