ఉక్రెయిన్-రష్యా యుద్ధం నాలుగేళ్లకు పైగా సాగుతోంది. ఈ యుద్ధం తర్వాత మొదలైన అన్ని యుద్ధాలు ముగిసిపోయాయి గానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం ముగియలేదు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. శాంతి ఒప్పందం చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. రెండు దేశాలు నిత్యం బాంబులు వేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట నుంచి శాంతి ఉచ్ఛరణ వచ్చింది. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాడుల ద్వారా రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ దాడుల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖకు ఆదేశించారు.
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జీ 7 సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్కు మద్దతుగా ఉండాలని దేశాలు తీర్మానం చేశాయి. రక్షణ విషయంలో అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తర్వాత రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఉధృతం చేసింది. ఇంధన రంగాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పుతిన్.. ఉక్రెయిన్తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

