Putin – Abbas Araghchi Meeting: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోమవారం రష్యా చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పుతిన్ నేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.
ప్రోటోకాల్ను కాదని పుతిన్ భేటీ..
సాధారణంగా ఏ దేశ విదేశాంగ మంత్రి అయినా మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి విదేశాంగ మంత్రిని మాత్రమే కలుస్తారు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పుతిన్ స్వయంగా అరాఘ్చీని ఆహ్వానించి చర్చలు జరపడం ఈ భేటీ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ నుంచి తనకు ఒక ప్రత్యేక సందేశం అందిందని పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. పుతిన్ మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు దేశాల అగ్ర నాయకత్వాల మధ్య దౌత్య సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇరాన్కు పుతిన్ ఇచ్చిన హామీలు ఇవే..
ఇరాన్ ప్రయోజనాల కోసం, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల శ్రేయస్సు కోసం రష్యా శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు. టెహ్రాన్తో మాస్కో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీని అర్థం.. కేవలం వాణిజ్యమే కాకుండా సైనిక, రాజకీయ అంశాల్లోనూ రెండు దేశాలు ఒకదానికొకటి వెన్నుదన్నుగా నిలవనున్నాయి. ఈ క్లిష్ట కాలాన్ని అధిగమించి త్వరలోనే ఇరాన్లో శాంతి నెలకొంటుందని రష్యా ఆశిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. ఈ భేటీతో ఇరాన్ ఒంటరి కాదని, రష్యా వంటి అగ్రరాజ్యం దాని వెనుక ఉందని ప్రపంచానికి స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఇది ఒక రకంగా ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయిందని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఒకవైపు అమెరికా, యూరప్, దాని మధ్యప్రాచ్య మిత్రదేశాలు ఉండగా.. మరోవైపు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా – ఇరాన్ మొదలైన దేశాలు ఉన్నాయి. రష్యా అండతో ఇరాన్ ఇకపై అంతర్జాతీయ వేదికలపై, చర్చల్లో మరింత వ్యూహాత్మకంగా, బలంగా తన గళాన్ని వినిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
