NTV Telugu Site icon

London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ

London

London

లండన్‌ ఎయిర్‌పోర్టులో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రయాణికుల పట్ల భద్రతా సిబ్బంది అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే చల్లి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లండన్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి నలుగురు ప్రయాణికులకు-భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరువురి మధ్య కొట్లాటకు దారి తీసింది. అక్కడకు చేరుకున్న పోలీసుల మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. ఇక అంతే.. ప్రయాణికుల్ని పోలీసులు చితకబాదారు. చేతులు వెనక్కి మడిచి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్పృహ కోల్పోయేలా చావబాదారు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రయాణికులంతా ఆందోళన కూడా చేశారు. ప్రస్తుతం నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత దారుణంగా కొడతారా? అంటూ నిలదీస్తున్నారు.

ఈ ఘటన అంతర్జాతీయంగా రచ్చ రచ్చ కావడంతో గ్రేటర్‌ మాంచెస్టర్‌ పోలీసులు స్పందించారు. ప్రయాణికులు చేసింది తప్పే కానీ… వారితో ముగ్గురు పోలీసులు ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన ఓ పోలీసును విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళా పోలీసు ముక్కుకు తీవ్ర గాయమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.