NTV Telugu Site icon

ఇటలీ పర్యటనలో ప్రధాని.. నేడు జీ 20 సదస్సుకు హాజరు

భారత ప్రధాని నరేంద్ర మోడీ… ఇటలీలో పర్యటిస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని… మోడీ అని ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు. రెండు రోజుల పాటు వాటికన్‌ సిటీలో జరగబోయే జీ20 సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, ఇండోనేషియా, సింగపూర్‌, జర్మనీ దేశాధినేతలతో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత వాటికల్ సిటీ చర్చి పోప్‌ ఫ్రాన్సిస్‌తో మోడీ సమావేశం కానున్నారు.

అంతకుముందు ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి భారత ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. రోమ్‌లోని పియత్స గాంధీ ప్రాంగణం దగ్గర భారీసంఖ్యలో గుమిగూడిన అభిమానులు.. మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. భారత జాతీయ జెండాలను పట్టుకుని స్వాగతం పలికారు. వారికి దగ్గరగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు మోడీ. కారులో వెళ్తూ అభివాదం చేశారు. భారత్‌ మాతా కీ జై.. మోడీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఇటలీ పర్యటన ముగిసిన తర్వాత… యూకే వెళ్లనున్నారు ప్రధాని మోడీ. యూకే ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు నవంబరు 1న… గ్లాస్గోలో జరిగే కాప్‌ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ కానున్నారు. నవంబరు 3న ఇండియాకు తిరిగి రానున్నారు నరేంద్ర మోడీ.