ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. అక్కడ ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని మోడీకి ఘన స్వాగతం పలికారు. భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా మోడీ ఈ పర్యటన చేపట్టారు.
తాష్కెంట్ చేరుకున్న అనంతరం ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. ఆయన చూపించిన ప్రత్యేక ఆతిథ్యానికి కృతజ్ఞతలు. ఉజ్బెకిస్థాన్కు ఇది నా నాలుగో పర్యటన. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల లోతు, వాటిలో పెరుగుతున్న వేగానికి నిదర్శనం” అని మోడీ పేర్కొన్నారు.
మిర్జియోయెవ్తో కీలక చర్చలు
పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, అధ్యక్షుడు మిర్జియోయెవ్తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. భవిష్యత్లో భారత్-ఉజ్బెకిస్థాన్ సహకారాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు.
తన పర్యటనకు ముందు మోడీ మాట్లాడుతూ.. ఇటీవలి సంవత్సరాల్లో భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత పెంచడంపై మిర్జియోయెవ్తో చర్చలు జరుపుతామని తెలిపారు. ‘వికసిత్ భారత్’, ‘యాంగీ ఉజ్బెకిస్థాన్’ లక్ష్యాల విషయంలో ఇరు దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య స్మారకాన్ని సందర్శించిన మోడీ
తాష్కెంట్ చేరుకున్న అనంతరం మోడీ యాంగీ ఉజ్బెకిస్థాన్ పార్క్ను సందర్శించారు. అక్కడి స్వాతంత్ర్య స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అధ్యక్షుడు మిర్జియోయెవ్ కూడా మోడీ వెంట ఉన్నారు. ఉజ్బెకిస్థాన్ స్వాతంత్ర్యం సాధించి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. మోడీ తన పర్యటనలో భాగంగా తాష్కెంట్లోని శాస్త్రి స్మారకాన్ని, తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు.
ఆగస్టు 30న కిర్గిజిస్థాన్కు..
ఉజ్బెకిస్థాన్లో రెండు రోజుల పర్యటనను ముగించుకున్న అనంతరం ఆగస్టు 30న ప్రధాని మోడీ కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొంటారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ సదస్సు జరగనుంది. SCO ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశం జరుగుతోంది. భారత్ 2017 నుంచి SCOలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది.
ఉగ్రవాదంపై భారత్ వైఖరి
SCO సదస్సులో భారత్ తన “భద్రత, కనెక్టివిటీ, అవకాశాలు” అనే దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుందని మోడీ తెలిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి తావులేని ప్రాంతం కోసం సభ్యదేశాలతో కలిసి పనిచేయడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. బిష్కెక్లో కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. ఇతర SCO దేశాల నేతలతోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అలాగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ప్రధాని పాల్గొననున్నారు.
#WATCH | Tashkent, Uzbekistan: Prime Minister Narendra Modi lays a wreath at Yangi Uzbekistan Park
Uzbekistan President Shavkat Mirziyoyev also present.
(Source: DD News) pic.twitter.com/BqFLHWGSIX
— ANI (@ANI) August 29, 2026

