Pakistan: బ్రిటన్లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన రోచ్డేట్ గ్రూమింగ్ గ్యాంగ్ నాయకుడైన అహ్మద్ను బహిష్కరించాలని బ్రిటన్ భావిస్తోంది. పాకిస్తాన్ ఈ దుర్మార్గుడిని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అయితే, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను విమర్శిస్తున్న బ్రిటన్లో ఉంటున్న నాయకులను తమకు అప్పటించాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది. 12 ఏళ్ల వయసున్న బాలికల్ని లక్ష్యంగా చేసుకుని అత్యాచారానికి పాల్పడిన 73 ఏళ్ల షబీర్ అహ్మద్ పాకిస్తాన్ జాతీయుడు.
30కి పైగా లైంగిక నేరాలు:
బాధితుల చేత ‘‘డాడీ’’ అని పిలువబడే అహ్మద్ 30కి పైగా లైంగిక నేరాలకు గానూ ఆగస్టు 2012లో 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇతను బ్రిటన్, పాకిస్తాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. దోషిగా నిర్ధారించిన తర్వాత ఇతను బ్రిటన్ పౌరసత్వాన్ని కోల్పోయాడు. అహ్మద్ యూకే పౌరసత్వాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇతడిని పాకిస్తాన్ పంపించలేదు. బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం 1971 ప్రకారం, 1973కి ముందు బ్రిటన్ వచ్చి, దేశంతో కనీసం ఐదేళ్లు నివసించిన కామన్వెల్త్ దేశాల పౌరులకు మినహాయింపు ఉంది.
బ్రిటన్కు పాక్ షరతులు:
ఇతడిని పాకిస్తాన్కు బహిష్కరించేందుకు చర్చలు సాగుతున్నాయి. ఇదే సమయంలో అహ్మద్ను పాకిస్తాన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో తమ షరుతుల్ని కూడా బ్రిటన్ అంగీకరించాలని మెలికపెడుతుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. అహ్మద్తో పాటు రోచ్డేల్ గ్రూమింగ్ గ్యాంగ్కు చెందిన మరో ఇద్దరు ప్రధాన సూత్రధారులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నందున తాము పాకిస్తానీయులం కాదని వారు వాదిస్తుండటంతో, పాకిస్తాన్ వీరిని తీసుకునేందుకు నిరాకరిస్తోంది.
ఒక వేళ అహ్మద్ను తీసుకుంటే యూకేలో పాక్ ప్రభుత్వం, ఆర్మీకి అసమ్మతి తెలియజేస్తున్న రాజకీయ కార్యకర్తలను పాక్ కోరుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో పనిచేసిన షెహ్జాద్ అక్బర్, మాజీ సైనిక అధికారి, జర్నలిస్టు ఆదిల్ రాజా, లండన్లో నివసిస్తున్న ఎంక్యూఎం వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్లను తమకు అప్పగించాలని పాక్ కోరుతోంది. బ్రిటన్ తమ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో బ్రిటన్ వీరిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది.
ఏడాది కాలంగా అహ్మద్ బహిష్కరణపై పాక్, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ అహ్మద్ను తిరిగి తీసుకునేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తే పాక్పై వీసా ఆంక్షలు విధిస్తామని, విదేశీ సాయాన్ని నిలిపేస్తామని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే, ఇది గతంలో లాంటి పాత పాకిస్తాన్ కాదని, బెదిరిపులకు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని పాక్ అధికారులు సమాధానం ఇస్తున్నారు. రోచ్డేల్కు చెందిన లైంగిక నేరస్తులు హమీద్ సాఫీ, మహమ్మద్ సాజిద్లను ఇప్పటికే పాకిస్తాన్కు పంపించారు.

