PoK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో నిరసనలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ ఆ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఎన్నికల్ని బహిష్కరించాలని కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా రావలకోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో సుమారు 40 మంది మరణించినట్లు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పేర్కొంది. గత కొంత కాలంగా పీఓకే ప్రజలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. పీఓకే అసెంబ్లీలో రిజర్వేషన్లను వ్యతిరేకించడంతో పాటు వనరులపై హక్కులు కల్పించాలని ఉద్యమిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో నిరసన తెలుపుతున్న ప్రజల్ని భారత్తో సమానంగా చూస్తామని, వారిని కూడా ‘‘భారత్ లాంటి శత్రవులుగానే పరిగణిస్తాం’’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా మాట్లాడుతూ.. పీఓకేలో ఉద్యమించే ప్రజలు తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులే అని, ఇప్పుడు వారే తమపై తిరగబడుతున్నారని ఆరోపించారు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని మరోసారి బహిరంగంగా ఒప్పుకున్నట్లైంది.
పీఓకే కూడా జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగమే అని భారత్ చాలా సందర్భాల్లో చెప్పింది. పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో చేస్తున్న మానవహక్కుల ఉల్లంఘనలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పీఓకేలో నిర్వహించే ఎన్నికలు, పరిపాలన మార్పులు వాస్తవ పరిస్థితిని మార్చలేవని భారత్ చెప్పింది. మరోవైపు, పాక్ ఈ నిరసనల్ని అణచివేసేందుకు ఇంటర్నెట్ నిలిపేయడంతో పాటు ఆహార పదార్థాల సరఫరా, ఔషధాలను అడ్డుకుంటుదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

