NTV Telugu Site icon

Pakistan: పాకిస్తాన్ రాజధాని లాక్ డౌన్.. ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ బంద్.. కారణం ఇదే..

Imran Khan

Imran Khan

Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన విడుదలను కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వ కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రాజధాని ఇస్లామాబాద్‌లోకి రాకుండా4 నిరోధించేందుకు పాకిస్తాన్ అధికారులు శుక్రవారం ముఖ్యమైన చర్యలు చేపట్టారు. ఇస్లామాబాద్‌కి రాకుండా అన్ని మార్గాలను మూసేశారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు.

Read Also: Big Breaking: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 30 మంది మావోయిస్టుల హతం..

ఇస్లామాబాద్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను అడ్డుకునేందుకు ఏకంగా షిప్పింగ్ కంటైనర్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు, పారామిలిటరీ భద్రత ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభల్ని అడ్డుకునేలా ప్లాన్ చేశారు. ఎవరైనా ఇస్లామాబాద్‌పై దాడి చేయాలని ప్లాన్ చేస్తే దానిని జరగనివ్వబోమని ఆ దేశ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ అన్నారు. అక్టోబర్ 15-16 తేదీల్లో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశానికి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్‌తో సహా ఇతర దేశాల ఉన్నత నాయకులు వస్తుండటంతో ర్యాలీని వాయిదా వేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల్ని కోరారు. ఇదిలా ఉంటే, ఇస్లామాబాద్, రావాల్పిండి, కరాచీ వంటి నగరాలతో పాటు పాకిస్తాన్‌లోని కొన్ని పట్టణాల్లో ఇంటర్నెట్‌ని బంద్ చేశారు.

అవిశ్వాస తీర్మానం ద్వారా 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయాడు. తాను దిగిపోవడానికి పాక్ సైన్యమే కారణం అంటూ, అమెరికా కుట్ర పన్నినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే, అవినీతి, దేశద్రోహం వంటి ఆరోపణకు సంబంధించి 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2023 నుంచి జైలులో ఉన్నారు.