Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. చివరకు మళ్లీ ఈ యుద్ధం ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు మరో దేశానికి శాంతిదూతగా వెళ్లేందుకు దాయాది దేశం సిద్ధమైంది. అయితే, దీనికి అసలు కారణం వేరేగా ఉంది. లిబియాలో అంతర్యుద్ధంలో శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా ముందుకొచ్చింది. అయితే, దీని వెనక ఆయుధాలు అమ్ముకోవాలనే మాస్టర్ ప్లాన్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
జూన్ 24న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, రావల్పిండిలో లిబియన్ నేషనల్ ఆర్మీ (LNA) డిప్యూటీ కమాండర్ సద్దాం హఫ్తార్కు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశానికి ముందు సద్దాం హఫ్తార్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, టర్కీ గూఢచార విభాగం అధిపతితో కూడా సమావేశమయ్యారు.
లిబియాలో ఏం జరుగుతోంది.?
ప్రస్తుతం లిబియాలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి గుర్తించిన గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ యూనిటీ(జీఎన్యూ) ట్రిపోలీలో అధికారంలో ఉండగా, తూర్పు లిబియాలో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ స్టెబిలిటీ(జీఎన్ఎస్) అధికారం చెలాయిస్తోంది. జీఎన్ఎస్కు ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని ఎల్ఎన్ఏ మద్దతు ఇస్తోంది. 2026 ఏప్రిల్లో ఇరు వర్గాలు ఉమ్మడిగా జాతీయ బడ్జెట్కు అంగీకరించినప్పటికీ, ఎన్నికలు, ఏకీకృత సైన్యం, చమురు ఆదాయం విషయంలో విభేదాలు ఉన్నాయి.
ఆయుధాలు డీల్స్ కోసం పాక్ ప్రయత్నం..
విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం, ఎన్ఎన్ఏతో పాకిస్తాన్ 4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో చైనా సహకారంలో తయారు చేసిన 16 JF-17 యుద్ధ విమానాలు, 12 సూపర్ ముష్షాక్ శిక్షణ విమానాలు సరఫరా చేయనున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం అమలైతే ఒక అరబ్ దేశానికి జేఎఫ్-17 యుద్ధ విమానం అమ్మడం తొలిసారి అవుతుంది.
శాంతిదూత హోదా కోసం తాపత్రయం..
అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వంలో పాక్ అమెరికాకు మరింత దగ్గరైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్లకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు లిబియా విషయంలో శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్, తన అంతర్జాతీయ ఖ్యాతిని మెరుగుపరుచుకోవాలని అనుకుంటోంది. ఇదే కాకుండా, ఈ శాంతి కార్యక్రమం చాటున ఆయుధాలు కూడా అమ్ముకోవాలని ప్రయత్నిస్తోంది.

