North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!

  • ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా మహిళల జట్టు
  • షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్
  • సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్
North Korea

North Korea

ఉత్తర కొరియా మహిళల ఫుట్‌బాల్ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఆసియాలో అత్యంత ప్రతిష్ఠాత్మక మహిళల క్లబ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ అయిన ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) మహిళల ఛాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఉత్తర కొరియాకు చెందిన నాగోహ్యాంగ్ మహిళల ఫుట్‌బాల్ క్లబ్ ఈ ఘనత సాధించిన తొలి ఉత్తర కొరియా క్లబ్‌గా నిలిచింది.

ఈ విజయానంతరం ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆటగాళ్లను అభినందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కిమ్ జోంగ్ ఉన్ చిరునవ్వుతో ఆటగాళ్లను అభినందిస్తుండగా.. జట్టు సభ్యులు మాత్రం భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు. చప్పట్లు కొడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు.

×
×
Ad

దక్షిణ కొరియాలోని సువాన్ నగరంలో జరిగిన ఫైనల్లో జపాన్ క్లబ్ టోక్యో వెర్డీ బెలేజాపై నేగోహ్యాంగ్ మహిళల జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కిమ్ క్యోంగ్ యోంగ్ హాఫ్ టైమ్‌కు ముందు చేసిన గోల్ జట్టుకు విజయాన్ని అందించింది. ఈ విజయంతో నేగోహ్యాంగ్ మహిళల జట్టు వచ్చే ఏడాది జరిగే ఫీఫా మహిళల ఛాంపియన్స్ కప్‌లో పాల్గొనే అర్హత సాధించింది. ప్రపంచంలోని ఆరు ఖండాల ఛాంపియన్ క్లబ్‌లు పాల్గొనే ఈ టోర్నమెంట్ చివరి దశ మ్యాచ్‌లు అమెరికాలోని మియామీలో జరగనున్నాయి.

జట్టు కోచ్ రి యు ఇల్ మాట్లాడుతూ.. తమపై నమ్మకం ఉంచిన కిమ్ జోంగ్ ఉన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియాలో నంబర్ వన్ జట్టుగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టడం తమకు గర్వకారణమని చెప్పారు. ఈ టోర్నమెంట్ సందర్భంగా ఉత్తర కొరియా జట్టు.. దక్షిణ కొరియా జట్టు సువాన్ FC మహిళలను సెమీఫైనల్లో 2-1 తేడాతో ఓడించింది. ఫైనల్ విజయం అనంతరం ఆటగాళ్లు ఉత్తర కొరియా జాతీయ జెండాతో మైదానంలో సంబరాలు జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఉత్తర కొరియా జట్టును అభినందిస్తూ దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ కూడా సోషల్ మీడియాలో సందేశం పోస్టు చేశారు. నేగోహ్యాంగ్ ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ.. భవిష్యత్తు పోటీల్లో కూడా విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కొరియా ద్వీపకల్పంలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ విజయం క్రీడల ద్వారా రెండు దేశాల ప్రజలను మరోసారి దగ్గర చేసిన సంఘటనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.