Nawaz Sharif: భారత్‌తో ఉద్రిక్తత.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..

  • పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ కీలక సలహా..
  • భారత్ పాక్ ఉద్రిక్తతల్ని దౌత్యపరంగా తగ్గించుకోవాలి..
Nawaz Sharif

Nawaz Sharif

Nawaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం సాయంత్ర పాకిస్తాన్ వందలాది డ్రోన్లతో, క్షిపణులతో భారత్‌పై అటాక్ చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ తరహా పరిస్థితులు నెలకున్నాయి. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కి, ఆయన సోదరుడు, మాజీ ప్రధాని అయిన నవాజ్ షరీఫ్ కీలక సూచనలు చేశారు. పెరుగుతున్న ఉద్రిక్తతల్ని తగ్గించుకోవడానికి దౌత్యపరమైన విధానం అవసరమని సలహా ఇచ్చినట్లు దిఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది.

Read Also: India-Pakistan Tensions: ప్రధాని మోడీతో త్రివిధ దళాధిపతుల భేటీ.. ఈసారి పాక్కి మూడినట్లేనా..?

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి వచ్చారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతి పునరుద్ధరించడానికి అందుబాటులో ఉన్న అన్ని దౌత్య వనరులను ఉపయోగించుకోవాలని ప్రధానికి సూచించినట్లు సమాచారం. 2023 ఏడాదిలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండటం గురించి ప్రస్తావించారు. కార్గిల్ యుద్ధాన్ని వ్యతిరేకించినందు వల్లే 1999లో తన ప్రభుత్వాన్ని తొలగించినట్లు చెప్పారు.

1999లో పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు కారణంగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూలిపోయింది. తన ప్రభుత్వ హయాంలో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి లాహోర్ వచ్చారని, అయితే, కార్గిల్ రూపంలో తాము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించామని నవాజ్ షరీఫ్ అన్నారు.