Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా కన్నుమూత!?
  • మసద్‌లో కుడ్యచిత్రం ఆవిష్కరణ
  • హాజరైన ఇరాన్ ప్రభుత్వ పెద్దలు
Mojtabakhamenei3

Mojtabakhamenei3

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇటీవల రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని.. అంతా క్షేమమని వార్తలొచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వ పెద్దలు ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. మీడియా కూడా స్పందించలేదు.

తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో చనిపోయిన ఇరాన్ నాయకుల కుడ్యచిత్రాన్ని మసద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇరాన్ ప్రభుత్వ పెద్దలంతా పాల్గొన్నారు. కుడ్యచిత్రంలో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు మోజ్తాబా ఖమేనీ సహా చనిపోయిన సైనిక, రాజకీయ నాయకులందరూ ఉన్నారు. ఈ ఫొటోతో ఇరాన్ అధికారులు క్లారిటీ ఇచ్చినట్లైంది. మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని అర్థమవుతోంది.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కుటుంబ సభ్యులు చనిపోయారు. అయితే కుమారుడు మోజ్తాబా గాయపడ్డారని.. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని ఇప్పటి వరకు వార్తలొచ్చాయి. ఇటీవల ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా జరిగిందని వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే తాజాగా ఇరాన్ అధికారులు మసద్‌లో అతి పెద్ద కుడ్యచిత్రాన్ని ఆవిష్కరించారు. అందులో అయతుల్లా అలీ ఖమేనీతో పాటు మోజ్తాబా కూడా ఉండడంతో కొత్త సుప్రీం లీడర్ కూడా చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.