Modi-Indonesia: భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు.. తీరనున్న జలసంధి కష్టాలు

  • భారత్-ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు
  • హిందూ మహా సముద్రంలో సొంత హార్ముజ్‌ను సృష్టించకోనున్న దేశాలు
  • తీరనున్న జలసంధి కష్టాలు
Modi1

Modi1

భారత్-ఇండోనేషియా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధాని మోడీ ప్రస్తుతం ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఇండోనేషియాకు వెళ్లిన మోడీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం మంగళవారం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతు.. పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో భారత్‌కు అండగా నిలిచిన ఇండోనేషియాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రధాని ప్రశంసించారు. ఇండోనేషియా జాతీయ చిహ్నమైన గరుడ, బాలిలోని ఉత్సాహభరితమైన పండుగలు వంటి.. రెండు దేశాలను కలిపి ఉంచే సాంస్కృతిక చిహ్నాలను కూడా ప్రస్తావించారు. రెండు దేశాల వంట సంప్రదాయాలను పోల్చారు. ఇండోనేషియా క్రుపుక్ లేదా భారతదేశపు పాపడ్‌లలో ఏది ఎక్కువ కరకరలాడుతుందో నిర్ణయించడం కష్టమని.. కానీ మసాలా, ఇండోనేషియా బంబు రెండూ నిత్యజీవితానికి రుచిని తెచ్చిపెడతాయని అన్నారు.

ఇక రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సారూప్యతలను చూపుతూ.. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని.. ‘ప్రజాస్వామ్యానికి తల్లి’ అని, ఇండోనేషియా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోడీ పేర్కొన్నారు. రెండు దేశాలు వందలాది భాషలకు, విభిన్న సంప్రదాయాలకు, బహుళ సంస్కృతులకు నిలయమని, భారతదేశం ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచం ఒకే కుటుంబం) అనే తత్వంతో నడుస్తుండగా.. ఇండోనేషియా ‘భిన్నత్వంలో ఏకత్వం’అనే సూత్రంపై స్థాపించబడిందని తెలిపారు. ‘మన భిన్నత్వాన్నే మన ఐక్యతకు పునాదిగా చేసుకున్నాం.’’ అని చెప్పారు.

2018లో ఇరు దేశాల సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరిన తర్వాత ఇండోనేషియాలో మోడీ చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ప్రధాని మోడీ చర్చలు జరిపి.. అనంతరం ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్, స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ పట్ల నిబద్ధతను బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం అని తెలిపారు.

ఇక భారత్-ఇండోనేషియా సంయుక్తంగా హిందూ మహా సముద్రంలో సొంత హార్ముజ్‌ను సృష్టించకోనున్నాయి. ఈ హార్ముజ్ మలక్కా జలసంధి ప్రవేశ ద్వారం దగ్గర ఉంది. భారతదేశంలోని అండమాన్ నికోబార దీవుల్లో ఉన్న ఇందిరా పాయింట్.. దీనికి కేవలం 100 మైళ్ల దూరంలో ఉంది. ఈ చర్యతో భారత్-ఇండోనేషియా హిందూ మహాసముద్రంలో చైనా వ్యూహాన్నే మార్చేయనున్నాయి. ఇండోనేషియాలోని సబాంగ్ పోర్టును అభివృద్ధి చేయడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. దీనిని ఆధునీకరించడంతో పాటు ఆ ద్వీపంలో భారతదేశ ఉనికిని కూడా పెంచనున్నారు.

ఇక ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు మోడీ మెల్‌బోర్న్ వెళ్లనున్నారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు.. పర్యటన చివరి దశలో ఆక్లాండ్‌కు వెళ్లనున్నారు.