Mexico Gun Attack: మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్ (ముఠా హింస) మరోసారి రక్తపాతం సృష్టించాయి. మెక్సికో తూర్పు – మధ్య రాష్ట్రమైన ప్యూబ్లాలోని టెహుయిట్జింగో పట్టణంలో సాయుధ దుండగులు జరిపిన ఘోర కాల్పుల్లో ఒక చిన్నారితో సహా 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారుజామున ఒక నివాస గృహమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్యూబ్లా ప్రజా భద్రతా సంస్థ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. మరణించిన వారిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉన్నారు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు సమాచారం అందించడంతో మున్సిపల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలైన ఒక మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూసింది. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎవరు? వారి మోటివ్ ఏంటి? అనే విషయాలను స్థానిక అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘాతుకంపై ఫెడరల్ అధికారులు, నేషనల్ గార్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
భయంతో పారిపోతున్న వందలాది కుటుంబాలు
మధ్య మెక్సికోలో ఇటీవల కాలంలో కార్టెల్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఈ ప్రాంతంలో అకస్మాత్తుగా పెరిగిన హింస కారణంగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు తీవ్రం అవుతున్నాయి. దీంతో వారు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటికే సుమారు 800 నుంచి 1,000 కుటుంబాలు వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస పారిపోయారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినప్పటికీ ప్యూబ్లా గవర్నర్ అలెజాండ్రో అర్మెంటా ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం.
వరుస హత్యలతో అల్లాడుతున్న ప్యూబ్లా
చాలాకాలంగా ఈ ప్రాంతం ముఠా హింసతో అట్టుడుకుతుంది. తాజాగా జరిగిన దాడి ఈ ఏడాది ప్యూబ్లా రాష్ట్రంలో జరిగిన మూడో పెద్ద సాయుధ దాడిగా చెబుతున్నారు. ఫిబ్రవరిలో ప్యూబ్లాలోని ‘హుహుఎట్లాన్ ఎల్ గ్రాండే’ నగరంలో దుండగుల చేతిలో ఆరుగురు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధాని నగరంలో ఒక వాహనంపై జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ముఠా హింసను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
