పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేటట్టుగా కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇరాన్ తన అణు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు అంగీకరించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పశ్చిమాసియా సైనిక చర్యలపై నిర్వహించిన సెనేట్ విచారణలో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు.
రూబియో మాట్లాడుతూ.. “నా జ్ఞాపకంలో అయితే తొలిసారిగా ఇరాన్ తన అణు కార్యక్రమంలోని కొన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమైంది. కేవలం నెల క్రితం, సంవత్సరం క్రితం కూడా వారు ఈ విషయాలను ప్రస్తావించేందుకు సైతం నిరాకరించారు. ఇప్పుడు వాటిపై చర్చలకు ముందుకు రావడం ఒక కీలక పరిణామం” అని పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి కోసం భారీ స్థాయిలో సంప్రదాయ సైనిక సామర్థ్యాలను పెంచుకునే ప్రయత్నం చేసిందని రూబియో ఆరోపించారు. క్షిపణులు, డ్రోన్లు, నౌకాదళం వంటి సైనిక శక్తిని పెంచుకుని అణ్వాయుధ కార్యక్రమాన్ని రక్షించాలనే లక్ష్యంతో ముందుకు సాగిందని చెప్పారు. అయితే అమెరికా, మిత్రదేశాల చర్యలతో ఆ రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.
ఇరాన్ నౌకాదళంపై కూడా రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇరాన్ నౌకాదళం ఇప్పుడు సముద్ర అడుగున ఉంది. మరికొన్ని సంవత్సరాల్లో అవి చేపల వేట ప్రాంతాలుగా మారిపోతాయి. ఇరాన్ సంప్రదాయ సైనిక రక్షణ వ్యవస్థ గణనీయంగా బలహీనపడింది” అని వ్యాఖ్యానించారు. అదే విధంగా హార్ముజ్ జలసంధి, ఇతర సముద్ర మార్గాల విషయంలో అమెరికా అమలు చేసిన దిగ్బంధం ప్రభావవంతంగా పనిచేసిందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జలసంధులను తిరిగి తెరవాలని అంగీకరించినప్పటికీ ఇరాన్ ఆ హామీని అమలు చేయలేదని ఆరోపించారు. దీంతో అమెరికా కూడా ఇరాన్ నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించిందని చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆంక్షలకు లోబడి ఉన్న నౌకలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు అణు కార్యక్రమంలోని కీలక అంశాలపై చర్చలను ఇరాన్ నిరంతరం తిరస్కరిస్తూ వచ్చింది. అంతేకాకుండా ఇరాన్ దగ్గర ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా టెహ్రాన్ ఖండించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇప్పుడు అణు కార్యక్రమంలోని కొన్ని అంశాలపై చర్చలకు సిద్ధమైందన్న రూబియో వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్యరంగంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ.. ఈ తాజా సంకేతాలు భవిష్యత్తులో అణు ఒప్పందంపై కొత్త చర్చలకు మార్గం సుగమం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
