Site icon NTV Telugu

North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..

North Korea

North Korea

North Korea: ఉత్తర కొరియా ఒక నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ దేశ ప్రజలకు తెలియదంటే అతిశయోక్తి కాదు. కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో రూల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వోన్నత నాయకుడిని ప్రశ్నిస్తే ఉరిశిక్షే గతి. ఇదే కాకుండా దక్షిణ కొరియా, అమెరికాకు చెందిన పాటలు విన్నట్లు తెలిసినా, సినిమాలు చూసినట్లు తెలిసినా మరణమే శరణ్యం. ఇక దేశం విడిచి వెళ్లాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబం కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సిందే.

10 ఏళ్ల ప్లానింగ్..

అలాంటి నిఘా ఉన్న కిమ్ రాజ్యం నుంచి ఒక కుటుంబం సాహసోపేతంగా తప్పించుకుంది. నార్త్ కొరియా నుంచి స్వేచ్ఛ పొందింది. ల్యాండ్ ద్వారా కాకుండా అత్యంత కఠినమైన సముద్ర మార్గం ద్వారా కుటుంబానికి చెందిన 9 మంది తప్పించుకోవడం సంచలనం. ఇది ఊరికే జరగలేదు. దీని వెనక 10 ఏళ్ల ప్రణాళిక దాగి ఉంది. ఈ ప్రణాళికను కేవలం రెండు గంటలు అమలు చేసి ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా చేరి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకున్నారు.

కిమ్ యి హ్యోక్ కుటుంబంలోని 9 మంది సురక్షితంగా నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకు చేరిన కథ చాలా ఇంట్రెస్టింగ్. ముందుగా కుటుంబంలో చిన్న కొడుకుగా ఉున్న కిమ్ యి హ్యోక్ ఉత్తర కొరియా తీర ప్రాంతానికి పని కోసం వెళ్లాడు. అతను కొన్నేళ్ల పాటు అక్కడే చేపల వేట నేర్చుకున్నాడు. పడవ మరమ్మతులు, వాతావరణం, సముద్ర మార్గాలు, కిమ్ సైనికులు గస్తీ కాచే విధానం, సముద్ర వాతావరణంపై పూర్తిగా పట్టు సాధించాడు. వివాదాస్పద సముద్ర సరిహద్దు నార్తర్న్ లిమిట్ లైన్ (NLL) సమీపంలో గస్తీ నమూనాలను అధ్యయనం చేయడానికి, నిఘాలోని లోపాలను గుర్తించడానికి ఆ కాలాన్ని ఉపయోగించుకున్నారు.

సాధారణ వ్యక్తిగా కనిపించేందుకు, సైనికులకు అనుమానం రాకుండా వారితో పరిచయాలు పెంచుకున్నాడు. అనేక సార్లు వారికి లంచాలు ఇచ్చాడు. ఇలా అనుమానం రాకుండా వ్యవహరించాడు. చైనా నుంచి అక్రమంగా తెచ్చిన టీవీ ద్వారా దక్షిణ కొరియా జీవన విధానంపై ఆశ పెంచుకున్న ఆ కుటుంబం, నార్త్ కొరియా నరక కూపం నుంచి బయటపడాలని భావించింది.

2 గంటల గ్రేట్ ఎస్కేప్:

2023లో మేలో కిమ్ ఇల్ హ్యోక్ భార్య గర్భిణిగా ఉన్న సమయంలో తన ప్లాన్ అమలు చేసింది ఆ కుటుంబం. భారీ వర్షం పడుతున్న సమయంలో రాత్రి వేళ దేశం దాటాలని భావించింది. ఇందుకు వారు అత్యంత కఠిన పరిస్థితులు ఉన్న ఎల్లో సీ మార్గాన్ని ఎంచుకున్నారు. చేపల వేటకు వెళ్తున్నామని అనుమతి తీసుకుని ప్లాన్ అమలు చేశారు. కుటుంబంలోని మహిళల్ని ముందుగా రహస్యంగా తీరానికి తీసుకువచ్చారు. పిల్లల్ని సంచుల్లో దాచారు. మొత్తం కుటుంబం పడవ ఎక్కింది. రాత్రి సమయంలో ప్రయాణం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఉత్తర కొరియా సైన్యానికి దొరికితే మరణమే గతి. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుల్ని దాటారు. యోన్‌ప్యోంగ్ ద్వీపం కనిపించిందని, ఆ తర్వాత తమ సెర్చ్ లైట్ వేయడంతో దక్షిణ కొరియా నేవీ తమను రక్షించిందని చెప్పారు. దక్షిణ కొరియా ప్రకరాం.. ఇప్పటి వరకు 35 వేల మంది ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చారు. ఇలా పారిపోయి వచ్చినవారిలో ఎక్కువ మంది మహిళలే.

Exit mobile version