జపాన్ ప్రధాని సనాయ్ తకైచి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. రోజుకు కేవలం తాను 3 గంటలు మాత్రమే నిద్రపోతానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుత ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె పని తీరు, అధిక పనిభారం, జపాన్లో కొనసాగుతున్న ఓవర్వర్క్ సంస్కృతిపై మరోసారి చర్చ మొదలైంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు మాత్రం నిద్రలేమి దేశ పాలనపై, ముఖ్యంగా జాతీయ భద్రతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
‘సీ డే’ సెలవు కూడా పనికే..
జాతీయ సెలవుదినమైన సీ డే (Sea Day) సందర్భంగా చాలామంది జపాన్ ప్రజలు సముద్ర తీరాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా.. తాను మాత్రం విధానపరమైన పత్రాలు చదవడం, వేలాది ఇ-మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడం, ఇంటి పనులు చేయడంలో గడిపినట్లు సనాయ్ తకైచి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మంగళవారం చేసిన పోస్టులో.. ‘‘ఎన్నో రోజుల తర్వాత సోమవారం ఐదు గంటలు పూర్తిగా నిద్రపోయాను. సాధారణంగా నాకు రోజుకు సున్నా నుంచి మూడు గంటలే నిద్ర ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా సెలవు రోజున కూడా దుస్తులు ఇస్త్రీ చేయడం, పాత స్కర్ట్లకు కుట్లు వేయడం, కోటు బటన్లు బిగించడం వంటి ఇంటి పనులు కూడా చేసినట్లు వివరించారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో 3.1 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.
ప్రతిపక్షాల విమర్శలు
సనాయ్ తకైచి వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష ఎంపీ టోరు కునిషిగే మాట్లాడుతూ.. ‘‘నిరంతర నిద్రలేమి మద్యం సేవించినట్లేనని.. నిర్ణయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది జాతీయ సంక్షోభాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.’’ అని వ్యాఖ్యానించారు. మరో ప్రతిపక్ష నేత హిరోయుకి కొనిషి.. ప్రధానమంత్రి ప్రతి చిన్న పత్రాన్ని స్వయంగా పరిశీలించడం సరైన పరిపాలనా విధానం కాదని, విధాన నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాని బాధ్యత అని పేర్కొంటూ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నేత యూయిచిరో తమాకి కూడా.. ‘‘విశ్రాంతి తీసుకోవడం కూడా ఒక నాయకుడి బాధ్యతే.’’ అని వ్యాఖ్యానించారు.
అయితే సనాయ్ తకైచికి పలువురు రాజకీయ నేతలు, నిపుణులు మద్దతు తెలిపారు. టోక్యోలోని నేషనల్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రొఫెసర్ యోకో ఇవామా మాట్లాడుతూ.. గతంలో జపాన్ ప్రధానమంత్రుల కుటుంబాల్లో ఇంటి పనులను భార్యలు చూసుకునేవారని, కానీ తకైచి స్వయంగా వాటిని నిర్వహిస్తున్నారని చెప్పారు. మహిళలు ఉన్నత స్థానాల్లో రాణించాలంటే ప్రధానమంత్రికి కూడా గృహపనుల భారం తగ్గించే సహాయక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. జపాన్ ఉప విదేశాంగ మంత్రి అయానో కునిమిట్సు కూడా తకైచికి మద్దతుగా స్పందిస్తూ.. ప్రతి నాయకుడి వెనుక వ్యక్తిగత బాధ్యతలు ఉంటాయని.. వాటిని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
ప్రస్తుతం సనాయ్ తకైచి ప్రభుత్వం కీలక బిల్లులను పార్లమెంట్లో ఆమోదింపజేయాల్సిన ఒత్తిడిలో ఉంది. మరోవైపు యెన్ విలువ 39 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, ఆర్థిక సవాళ్లు, ప్రజా మద్దతు తగ్గడం వంటి సమస్యలను కూడా ప్రభుత్వం ఎదుర్కొంటోంది. జూలై ప్రారంభం నుంచి ప్రతి వారాంతంలో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రధానమంత్రి నివాసంలోనే విధాన పత్రాలను పరిశీలిస్తూ పనిచేస్తున్నానని తకైచి తెలిపారు.
మళ్లీ తెరపైకి ఓవర్వర్క్ సంస్కృతి
ఇదిలా ఉంటే సనాయ్ తకైచి వ్యాఖ్యలతో జపాన్లోని ఓవర్వర్క్ కల్చర్ మరోసారి చర్చనీయాంశమైంది. జపాన్లో ఎక్కువ గంటలు పని చేయడం నిబద్ధతకు గుర్తుగా భావించే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇదే కారణంగా ‘‘కరోషి’’ (Karoshi – అధిక పనిభారం వల్ల మరణం) అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. 2016లో ప్రముఖ ప్రకటన సంస్థ డెంట్సు ఉద్యోగి మత్సురి తకహాషి నెలలో 100 గంటలకు పైగా ఓవర్టైమ్ పనిచేసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తర్వాత జపాన్ ప్రభుత్వం నెలకు గరిష్ఠంగా 45 గంటల ఓవర్టైమ్ పరిమితిని అమలు చేసింది.
అయితే 1990లలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సనాయ్ తకైచి తనను కష్టపడి పనిచేసే నాయకురాలిగా తీర్చిదిద్దుకున్నారు. గత ఏడాది జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ‘‘పని… పని… పని… పని… పని చేస్తూనే ఉంటాను.’’ అని ప్రకటించారు. గతంలో కూడా తెల్లవారుజామున 3 గంటలకు అధికారులను విధులకు పిలిపించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అధికారిక సమావేశానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాల్సి రావడంతోనే అలా చేశానని అప్పట్లో ఆమె వివరణ ఇచ్చారు.

