Independence Day Wishes: ఇండియాతో తమకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని.. వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించనున్నట్టు పలు దేశాధినేతలు, ప్రధాన మంత్రులు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించకున్న సంగతి తెలిసిందే. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇండియాలోనే కాకుండా పలు దేశాల్లోని భారతీయులు తమ జాతీయ జెండాను ఆవిష్కరించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు భారత దేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల తెలిపారు. ఇండియాతో తమకు ప్రత్యేక అనుంబంధం ఉంటుందని.. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తున్నట్టు వారు తమ సందేశాల్లో ప్రకటించారు.
Read also: Viral Video: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపిన తాగుబోతు… వీడియో చూస్తే నవ్వులే నవ్వులు
77వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న భారత్కు పలు దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయా దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు అభినందన సందేశాలు పంపారు. భారత్తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకొంటామని సందేశంలో ఆయా దేశాధినేతలు తెలిపారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, శ్రీలంక, నేపాల్, ఆస్ట్రేలియా, ఇరాన్, భూటాన్, మారిషస్, ఇజ్రాయెల్, మాల్దీవులు తదితర దేశాలు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్ష సందేశాలు వచ్చాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అయితే బాస్టిల్ డే సందర్భంగా ప్రధాని మోడీ పాల్గొన్న కీలక కార్యక్రమాల వీడియోను కూడా షేర్ చేశారు. బ్రిటన్ రాజధాని లండన్లోని భారత రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున భారత సంతతి ప్రజలు చేరుకుని స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాల్లో ఆ దేశ విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన వేడుకలకు స్థానిక భారతీయులు, అధికారులు హాజరయ్యారు. ఆస్ట్రేలియాలో భారత రాయబారి మన్ప్రీత్ వోహ్రా జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రపతి సందేశాన్ని చదివారు. సింగపూర్లో తాత్కాలిక రాయబారి పూజ ఎం. టిల్లు 1000 మంది భారత సంతతి ప్రజలతో కలిసి ఐఎన్ఎస్ కులిష్ను సందర్శించారు. శ్రీలంకలో రాయబారి గోపాల్ బాగ్లే ఇతర అధికారులు భారత శాంతి పరిరక్షక దళం స్మారకం వద్ద శ్రద్ధాంజలి ఘటించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించారు. సంయుక్త చర్యల ద్వారా అన్ని రంగాల్లో ఫలవంతమైన ద్వైపాక్షిక సహకారాన్ని భారత్-రష్యాలు కొనసాగిస్తాయని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక భాగస్వామ్యంలో కలిసి నడుస్తాయని.. ఇండియాతో ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యానికి, సంబంధాలకు మేం విలువనిస్తామని స్పష్టం చేశారు.