ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. ఎంతో కట్టుదిట్టమైన భద్రతలో ఉంటారు. ఎక్కడుంటారో.. ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. బాహ్య ప్రపంచానికి కనబడేది చాలా తక్కువ. ముఖ్యమైన సమయాల్లోనే ప్రత్యక్షమవుతుంటారు. అలాంటిది ఖమేనీ జాడను ఎలా కనిపెట్టగలిగారని ప్రపంచమంతా నివ్వెరపోతుంది. అటు సోషల్ మీడియాలోనూ.. అటు పబ్లిక్లోనూ ప్రపంచమంతా జోరుగా చర్చ సాగుతోంది. తాజాగా అందుకు సంబంధించిన సీక్రెట్ సమాచారం వెలుగులోకి వచ్చింది.
గతేడాది డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఆ సమయంలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో దాదాపు 30 వేల మంది నిరసనకారులు చనిపోయారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగి నిరసనకారులపై మారణకాండ ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అణు ఒప్పందం చేసుకోకపోతే అన్నంత పని చేస్తామంటూ పదే పదే ట్రంప్ వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. ఖమేనీ లక్ష్యంగా తీవ్ర బెదిరింపులు ఇచ్చారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున యూఎస్ బలగాలు అరేబియా సముద్రంలో మోహరించాయి. కానీ ఏ రోజూ ఖమేనీ లెక్కచేయలేదు. అమెరికా అంతు తేలుస్తామంటూ బదులిచ్చారు.
అయితే ఖమేనీ జాడను కనిపెట్టడం అమెరికా, ఇజ్రాయెల్కు చాలా కాలం సాధ్యం కాలేకపోయింది. మొత్తానికి ఫిబ్రవరి 28న పక్కా సమాచారం ఇజ్రాయెల్ చేతికి చిక్కగానే ఐడీఎఫ్ దళాలు రంగంలోకి దిగి ఖమేనీని అంతమొందించాయి.
అయితే ఇప్పుడు ఖమేనీ జాడను ఎలా కనిపెట్టగలిగారనేది ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. తాజాగా అందుకు సమాచారం వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా టెహ్రాన్ సీసీ కెమెరాలను ఇజ్రాయెల్ హ్యాక్ చేస్తోంది. టెహ్రాన్ ట్రాఫిక్ కెమెరా వ్యవస్థను చాలా సంవత్సరాలుగా హ్యాక్ చేస్తూ ఇజ్రాయెల్ తన గుప్పిట్లో పెట్టుకున్నట్లుగా ‘‘ఫైనాన్షియల్ టైమ్స్’’ తన కథనంలో పేర్కొంది. నగరంలోని సీసీ కెమెరాలతో పాటు మొబైల్ నెట్వర్క్ యాక్సెస్ కూడా ఇజ్రాయెల్కు చిక్కినట్లుగా తెలిపింది. ఖమేనీ, అతని భద్రతా వర్గానికి చెందిన ప్రతి ఒక్కరి కదలికను నిత్యం పర్యవేక్షిస్తూనే ఉన్నట్లుగా నివేదించింది.
ఫిబ్రవరి 28న కూడా టెహ్రాన్లోని చాలా ట్రాఫిక్ కెమెరాల ఫుటేజ్ను ఎన్క్రిప్ట్ చేసి విదేశాలకు పంపినట్లుగా వెల్లడించింది. దీంతో ఖమేనీ పూర్తి కదలికలను గుర్తించగలిగిందని స్పష్టం చేసింది. ఎవరు ఎప్పుడు వెళ్లారు.. ఎవరు ఎవరితో ఉన్నారు. ఏ మార్గంలో ఎవరు వెళ్తున్నారు అనే సమాచారాన్ని పక్కాగా ఇజ్రాయెల్ కనిపెట్టగలిగింది. ఈ క్రమంలోనే ఖమేనీ జాడను గుర్తించగలిగిందని నివేదికలో పేర్కొంది.
ఇది నిన్నామొన్నటి ఆపరేషన్ కాదని.. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లుగా తెలిపింది. ఇజ్రాయెల్ మొసాద్ చాలా లోతుగా వెళ్లిపోయిందని.. లైవ్ కెమెరా ఫీడ్లు యాక్సెస్ చేస్తూ… మొబైల్ నెట్వర్క్ డేటాను ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ భద్రతా సిబ్బంది కదలికలను కనిపెట్టినట్లుగా వెల్లడించింది. ఖమేనీ బాడీగార్డ్లు ఎక్కడ పార్క్ చేస్తున్నారు.. గార్డులు ఎప్పుడు ఎవరు మారారు.. వారు ఏ మార్గాల్లో వెళ్లారో వారి వివరాలను డిజిటల్ మ్యాప్ చేసుకున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 28న కూడా కచ్చితమైన సమాచారాన్ని సేకరించి ఇజ్రాయెల్ ప్రణాళికను రచించినట్లుగా నివేదికలో పేర్కొంది. పూర్తి అంచనా వేశాకే.. ఇజ్రాయెల్ వ్యూహాన్ని రచించినట్లుగా వెల్లడించింది. అధ్యక్ష భవనంలో ఖమేనీ ఉన్నాడన్న సమాచారం అందగానే ఎనిమిది క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది. దీంతో అక్కడికక్కడే ఖమేనీ నేలకూలిపోయాడు. శిథిలాల్లో ఛిద్రమైపోయారు. అధికార యంత్రాంగంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
