NTV Telugu Site icon

Israel-Hezbollah War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులు.. 182 మంది మృతి

Israelhezbollah War

Israelhezbollah War

పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. గత వారం లెబనాన్‌లోని హిజ్బుల్లా నాయకుల లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను ఇజ్రాయెల్ పేల్చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా 300 రాకెట్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఈ ఘటనలో 182 మంది మృతిచెందగా.. 700 మంది గాయపడ్డారు. రాకెట్లు లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఇదిలా ఉంటే దక్షిణ లెబనాన్‌లోని ప్రజలు ఇళ్లు, భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఆ దేశ సైనిక బృందం హెచ్చరించింది. ఇక్కడే హిజ్బుల్లా ఆయుధాలను నిల్వ చేసినట్లుగా సమాచారం. గత వారం ఇరాన్ మద్దతుగల సాయుధ బృందం ఇజ్రాయెల్‌పై 140కిపైగా క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులు నిర్వహించింది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: మైనార్టీ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

సోమవారం లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ మిలిటరీ దాదాపు 300 రాకెట్ దాడులు చేయడంతో కనీసం 182 మంది మరణించారు. 700 మందికి పైగా గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటనలో పేర్కొంది. మరణించిన వారిలో పిల్లలు, మహిళలు ఉన్నారు. హిజ్బుల్లా లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం టెల్ అవీవ్‌లోని మిలిటరీ ప్రధాన కార్యాలయం నుంచి అదనపు దాడులను మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలేవి ఆమోదించినట్లు చూపుతున్న ఫొటోను కూడా షేర్ చేసింది.

ఇది కూడా చదవండి: RN Ravi: భారతదేశంలో ‘సెక్యులరిజం’ అవసరం లేదు- తమిళనాడు గవర్నర్..

ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ అప్రమత్తం అయింది. రెండు రోజుల పాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు లెబనాన్ ప్రకటించింది. తూర్పు, దక్షిణ ప్రాంతాలతో పాటు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని పాఠశాలలు రెండు రోజులు మూసివేస్తున్నట్లు లెబనీస్ విద్యామంత్రి అబ్బాస్ పలాబీ సోమవారం ప్రకటించారు. భద్రత, సైనిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక ప్రజలు కూడా ఇజ్రాయెల్ దాడులకు దూరంగా వెళ్లిపోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే ఆస్పత్రుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేయాలని కోరింది.