NTV Telugu Site icon

Israel: ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం

Antonioguterres

Antonioguterres

ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. బదులు తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఐడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం ఇరాన్ క్షిపణి దాడులను చేసింది. అయితే ఈ దాడులను ఇప్పటి వరకు ఐక్య రాజ్య సమితి ఖండించలేదు. దీంతో ఇజ్రాయెల్ మరింత కోపంతో రగిలిపోయింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా పరిగణించింది. ఇరాన్‌ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌.. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Israel: ఇజ్రాయెల్‌ సైన్యంలో తొలి మరణం.. లెబనాన్‌లో ఒకరు చనిపోయినట్లు వెల్లడి

ఇరాన్‌ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఖండించలేదని ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కాట్జ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు అండగా నిలుస్తున్నారని, ఐరాస చరిత్రపై ఆయనో మాయని మచ్చ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. గుటెరస్‌ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్‌ తన పౌరులను రక్షించుకుంటుందని, దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. గుటెరస్‌ను ‘పర్సనా నాన్‌ గ్రాటా’గా ప్రకటించామని పేర్కొంటూ.. ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Indrakeeladri: దుర్గమ్మకు కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న విజయవాడ సీపీ

ఇదిలా ఉంటే ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని, తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భద్రతా కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇరాన్‌ చర్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమపై చేసిన క్షిపణి దాడి విఫలమైందని.. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్‌ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన అమెరికాకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున