Site icon NTV Telugu

Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ

Iranpak

Iranpak

ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఇరాన్ ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని ఇరాన్ ముందే స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడానికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను ఇరాన్.. పాకిస్థాన్‌కు అందించినట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే అమెరికా బృందం శనివారం సాయంత్రానికి ఇస్లామాబాద్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి జేడీ వాన్స్ కాకుండా అమెరికా నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ పేర్కొన్నారు. చర్చల కోసం ఇరానీయులు సంప్రదించారని.. ముఖాముఖి సంభాషణ కోసం అడిగారని తెలిపారు. చర్చల విషయాలను అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమ బృందం వివరిస్తారని చెప్పారు.

ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. అనూహ్యంగా శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

 

Exit mobile version