అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెల టర్కీలో జరిగిన నాటో సదస్సు సందర్భంగా విమానం రహస్యంగా మార్చిన వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రంప్ను తీసుకెళ్తున్న విమానంపై ఇరాన్ క్షిపణి దాడి చేసే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతోనే ఈ అసాధారణ ఆపరేషన్ చేపట్టినట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం వెల్లడించింది.
జూలై 8న నాటో సదస్సు చివరి రోజున ట్రంప్ అంకారా నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ముప్పు గురించి అమెరికా నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఎయిర్ఫోర్స్ వన్ను లక్ష్యంగా చేసుకుని ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణితో దాడి చేసే అవకాశం ఉందని పలు మార్గాల ద్వారా అమెరికా నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు ఇద్దరు అమెరికా అధికారులు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అంతేకాదు.. నాటో సదస్సు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఓ వ్యక్తి భుజం నుంచి ప్రయోగించే క్షిపణిని కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు కూడా సమాచారం అందింది. మరోవైపు ట్రంప్ అంకారాలో ఎక్కడ బస చేస్తున్నారో ఇరాన్కు చెందిన ఆపరేటివ్లకు కచ్చితంగా తెలుసని అమెరికా నిఘా వర్గాలు భావించినట్లు కథనం తెలిపింది. ట్రంప్ బస చేసిన భవనంలోని ఏ అంతస్తులో ఆయన ఉన్నారో కూడా ఇరాన్కు తెలుసన్న సమాచారం అమెరికాకు అందినట్లు పేర్కొంది. ఈ సమాచారాన్ని అమెరికా అధికారులు అత్యంత విశ్వసనీయమైనదిగా భావించడంతో ట్రంప్ను టర్కీ నుంచి బయటకు తీసుకురావడానికి అనూహ్యమైన రహస్య ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఎయిర్ఫోర్స్ వన్ ఎక్కిన ట్రంప్.. ఆ తర్వాత ఏమైంది?
టర్కీ నుంచి పాత ఎయిర్ఫోర్స్ వన్లోనే బయలుదేరతానని ట్రంప్ గతంలో బహిరంగంగా ప్రకటించారు. ‘‘పాత జ్ఞాపకాల కోసం’’ అదే విమానంలో ప్రయాణిస్తానని చెప్పినట్లు సమాచారం. అనుకున్నట్లుగానే ట్రంప్ కెమెరాలు, ఫొటోగ్రాఫర్ల సమక్షంలో ఎయిర్ఫోర్స్ వన్లోకి ఎక్కారు. దీంతో ఆయన అదే విమానంలో అమెరికాకు బయలుదేరుతున్నారన్న భావన అందరికీ కలిగింది. కానీ అసలు ప్రణాళిక మాత్రం వేరుగా ఉంది.
వైట్హౌస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, సహాయక సిబ్బంది, జర్నలిస్టులతో కూడిన ‘డికాయ్’ విమానాన్ని ముందుగా గాల్లోకి పంపారు. అనంతరం ట్రంప్ను విమానాశ్రయంలోని క్యాటరింగ్ కంటైనర్లో రహస్యంగా తరలించారు. ఆ తర్వాత సమీపంలో సిద్ధంగా ఉంచిన చిన్న సైనిక విమానంలోకి ఆయనను తరలించి టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లినట్లు కథనం వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ట్రంప్తో ప్రయాణిస్తున్న జర్నలిస్టులు కూడా తెలియకుండానే ‘డికాయ్’లో భాగమయ్యారు. తమను డికాయ్గా ఉపయోగించారని తెలుసుకున్న తర్వాత కొంతమంది జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భద్రతా ముప్పు గురించి తమకు ముందుగానే సమాచారం ఇవ్వకపోవడంపై వైట్హౌస్పై విమర్శలు చేశారు.
ఖతార్ ఇచ్చిన లగ్జరీ విమానం వల్లే సమస్యా?
ట్రంప్ ఇటీవల ఖతార్ నుంచి బహుమతిగా అందిన విలాసవంతమైన బోయింగ్ 747 విమానంలో టర్కీకి వెళ్లారు. భవిష్యత్తులో అధ్యక్ష విమానంగా ఉపయోగించేందుకు ఆ విమానాన్ని సిద్ధం చేస్తున్నారు. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఖతార్ బహుమతిగా ఇచ్చిన విమానంలో పాత ఎయిర్ఫోర్స్ వన్లో ఉన్న స్థాయిలో క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలు లేవు. దీంతో ట్రంప్ టర్కీ నుంచి బయలుదేరే సమయంలో పాత ఎయిర్ఫోర్స్ వన్ను ఉపయోగించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇదొక కారణంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విమానం మార్పు కారణంగా ట్రంప్ సాధారణంగా తనతో పాటు ప్రయాణించే సీనియర్ వైట్హౌస్ అధికారులు, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులకు దూరంగా వెళ్లాల్సి వచ్చింది.
అయితే ఈ భద్రతా ముప్పు తీవ్రతపై ట్రంప్ మాత్రం పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు. మంగళవారం ఒహియోలో జరిగిన కార్యక్రమం నుంచి తిరిగి వచ్చిన అనంతరం విలేకరులు ఈ ఘటన గురించి ప్రశ్నించగా.. సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు తనను మరో విమానంలో వెళ్లాలని కోరారని తెలిపారు. ‘‘వారు నన్ను వేరే విమానంలో, వేరే విమానంతో వెళ్లాలని కోరారు. ‘అక్కడ ఏదో ముప్పు ఉందని నేను భావిస్తున్నాను. దాని గురించి నేను పెద్దగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

