Site icon NTV Telugu

Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Iranflights

Iranflights

పశ్చిమాసియాలో రెండు నెలల పాటు యుద్ధంతో దద్దరిల్లింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై యుద్ధం చేసింది. దీంతో రెండు నెలల పాటు మధ్యప్రాచ్యం వైమానిక దాడులు.. బాంబ్ దాడులతో మార్మోగింది. దీంతో ఇంటర్నెట్‌తో పాటు గగనతలాన్ని ఇరాన్ మూసేసింది. అయితే తాజాగా ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగించినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. యుద్ధం కారణంగా రెండు నెలల పాటు నిలిచిపోయిన సర్వీసులు ఈరోజు నుంచి పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఇరాన్‌లో చిక్కుకున్న వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. స్వదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

శనివారం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండచి వాణిజ్య విమాన సర్వీసులను పునఃప్రారంభమైనట్లుగా అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్, ఒమన్‌లోని మస్కట్, సౌదీ అరేబియాలోని మదీనాకు విమానాలు బయలుదేరాయని ప్రభుత్వ ఆధీనంలోని టెలివిజన్ తెలిపింది. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్‌లో చర్చలు జరుపుతున్నారు. అమెరికా బృందం శనివారం సాయంత్రానికి చేరుకోనున్నారు.

ఈ సారి జేడీ వాన్స్ కాకుండా అమెరికా నుంచి మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మాత్రమే ఇస్లామాబాద్ వెళ్తున్నట్లుగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవట్ తెలిపారు. చర్చల కోసం ఇరానీయులు సంప్రదించారని.. ముఖాముఖి సంభాషణ కోసం అడిగారని తెలిపారు. చర్చల విషయాలను అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు తమ బృందం వివరిస్తారని చెప్పారు.

ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల పాటు తొలి దశ చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చలు గత బుధవారం జరగొచ్చని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి. అనూహ్యంగా శనివారం మరోసారి చర్చలకు శ్రీకారం చుట్టారు. ఈ చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

ఇక ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతుండగా పెద్ద ఎత్తున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇస్లామాబాద్ నగరాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Exit mobile version