ఇరాన్కు చెందిన ప్రముఖ గాయని పరాస్తు అహ్మదికి కఠిన శిక్ష పడింది. హిజాబ్ ధరించకుండా స్టేజ్పై కచేరీ చేసినందుకు శిక్షకు గురైంది. 74 కొరడా దెబ్బలకు గురైంది. సంగీత కచేరీలో హిజాబ్ ధరించకుండా చేతులు లేని దుస్తులు వేసుకుని ప్రదర్శన ఇచ్చినందుకు ఈ శిక్ష పడింది. అయితే ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలువురు మానవ హక్కుల కార్యకర్తలు నిరసించారు.
వివాదం ఎక్కడ మొదలైంది?
2024 డిసెంబర్లో 29 ఏళ్ల పరాస్తు అహ్మది యూట్యూబ్లో ఒక ప్రత్యక్ష సంగీత కచేరీ నిర్వహించారు. అందులో ఆమె ఇరాన్ దేశభక్తి గీతం ‘అజ్ ఖూనే జవాననే వతన్’ను ఆలపించారు. ఈ కచేరీని లక్షలాది మంది వీక్షించారు. ఈ ప్రదర్శన సమయంలో గాయని హిజాబ్కు బదులుగా చేతులు లేని దుస్తులు ధరించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వివాదం తర్వాత ఇరాన్ అధికారులు గాయనితో పాటు ఆమె బృందంలోని కొంతమంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడుదల చేసినప్పటికీ.. వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగాయి.
గాయని వీడియో 27 నిమిషాల నిడివి ఉంది. అందులో ఆమె నల్లటి, చేతులు లేని దుస్తులు ధరించింది. చాలా మంది మహిళలు దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛ చర్యగా భావించారు. అయితే ఇరాన్ అధికారుల దృష్టిలో ఇది చట్ట ఉల్లంఘనగా మారింది. ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి. సోలో సింగింగ్ విషయంలో కూడా కఠినమైన నియమాలు ఉన్నాయి. మహిళలు బహిరంగంగా ఒంటరిగా పాడటం నిషిద్ధం. చట్టం ప్రకారం.. వారు హిజాబ్ లేకుండా బహిరంగంగా కనిపించకూడదు. కానీ పరాస్తూ ఎల్లప్పుడూ ఈ నియమాలను వ్యతిరేకిస్తూ వచ్చింది. 2022లో కూడా హిజాబ్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో కూడా పాల్గొంది.
హిజాబ్ ధరించనందుకు శిక్ష.
ది గార్డియన్ నివేదిక ప్రకారం.. ఇరాన్లోని ఖోమ్ ప్రావిన్స్లోని ఒక కోర్టు పరాస్తుకు, బృందంలోని ఎనిమిది మంది సభ్యులకు ఒక్కొక్కరికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అశ్లీల కంటెంట్ను ప్రచురించిందని కోర్టు ఆరోపించింది. అంతేకాకుండా పరాస్తు రెండేళ్లపాటు దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి కళాత్మక కార్యకలాపాలలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఇరాన్ కళాకారులలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ శిక్షను సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. ఇరాన్లో ఈనాటికీ ఏమీ మారలేదని ప్రజలు అంటున్నారు. మానవ హక్కుల పరిస్థితి అస్సలు మారలేదని ధ్వజమెత్తారు.

