ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం డేట్ కూడా ఫిక్స్ చేసింది. జూలై 9న మషద్లో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూలై 4 నుంచే అంత్యక్రియల కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. 6 రోజుల పాటు 3 నగరాల్లో అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక అంత్యక్రియలకు దాదాపు 20 మిలియన్ల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 4న టెహ్రాన్లో అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. జూలై 9న మసద్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇమామ్ రెజా మందిరంలో ఖననం జరగనుంది. ఈ మేరకు శనివారం ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది.
ఇక అంత్యక్రియలను పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటైంది. జూలై 4, 5 తేదీల్లో టెహ్రాన్లోని ఇమామ్ ఖమేనీ మొసల్లా ప్రార్థనా స్థలంలో వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. జూలై 6న రాజధానిలో ప్రజా సంతాప కార్యక్రమాలు కొనసాగి.. జూలై 7న పవిత్ర నగరమైన ఖోమ్కు తరలివెళ్తాయి. జూలై 9న మషద్లో షియా ఇస్లాంలో ఖననం జరగనుంది. ఇక ఈ అంత్యక్రియలకు దాదాపు 2 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తోంది. అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఖమేనీతో పాటు కీలక నేతలంతా నేలరాలిపోయారు. అయితే అంత్యక్రియాల్లో మళ్లీ దాడులు జరగొచ్చేమోనన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటి వరకు ఖననం జరగలేదు. వాస్తవంగా అప్పటి నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 100 రోజులు పూర్తైంది. అయితే తాజాగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందం జరగవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.

