US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్

  • అమెరికాలో మరో ఘోరం
  • స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Usmurder

Usmurder

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులకు మరో ఘోరం జరిగిపోయింది. గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళను అత్యంత దారుణంగా దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దుర్ఘటన భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించాయి.

గుజరాత్‌లోని మోహసానా జిల్లాకు చెందిన 45 ఏళ్ల మేఘనా పటేల్ 10 ఏళ్ల నుంచి అమెరికాలోని వర్జీనియాలో నివాసం ఉంటూ ఒక సూపర్ మార్కెట్‌లో పని చేస్తోంది. అయితే ఈ నెల 23న స్టోర్‌లో కస్టమర్లు ఎవరూ లేరు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి కస్టమర్ వేషంలో సూపర్ మార్కెట్‌లోకి వచ్చాడు. ప్యాంట్, జాకెట్, గ్లవ్స్, మాస్క్, టోపీ ధరించి.. మేఘనా పటేల్ ఉన్న కౌంటర్ దగ్గరకు వచ్చాడు. ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్లుగా కొద్దిసేపు నటించాడు. అంతలోనే అకస్మాత్తుగా జేబులో నుంచి తుపాకీ తీసి కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్లు తలలోకి దూసుకెళ్లడంతో కౌంటర్ దగ్గరే మేఘనా కుప్పకూలిపోయింది. అంతటితో ఆగని దుండగుడు కౌంటర్ లోపలికి తొంగి చూసి మరోసారి కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం టేబుల్ దగ్గర ఉన్న కొన్ని వస్తువులు తీసుకుని పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పాయింట్.. పాయింట్ సీసీటీవీలో రికార్డయ్యాయి.

మేఘనా పటేల్ మరణవార్త తెలుసుకున్న గుజరాత్‌లోని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆమె తల్లిదండ్రులు కర్సన్‌భాయ్ పటేల్, కపిలాబెన్ ప్రస్తుతం గుజరాత్‌లోనే నివసిస్తున్నారు. భర్త ఉపేంద్రభాయ్ పటేల్, కుమార్తె నక్షిబెన్, కుమారుడు స్మిత్ మాత్రం అమెరికాలో స్థిరపడ్డారు. ఇక ఈ ఏడాది అమెరికాలో హత్యకు గురైన నాలుగో గుజరాతీ వ్యక్తిగా మేఘనా పటేల్ నిలిచారు. ఈ ఘటనపై అమెరికాలోని గుజరాతీ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.