India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!

  • యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి
  • నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది
  • నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బంది
India Flagged Cargo Ship Si

India Flagged Cargo Ship Si

యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత్‌కు చెందిన కార్గో నౌకపై ప్రాజెక్టైల్‌తో దాడి జరగడంతో నౌక బోల్తా పడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. వారిలో 13 మంది భారతీయ నావికులు ఉన్నారు. రక్షించిన సిబ్బందిని మోఖా పోర్టుకు తరలించారు. భారత్‌కు చెందిన వాణిజ్య నౌక MSV Faize Noore Oliyaపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

ఆగస్టు 4న యెమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో నౌక మునిగిపోయిందని MEA వెల్లడించింది. నౌకలో ఉన్న 13 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, నౌక సిబ్బంది భద్రత కోసం యెమెన్ అధికారులతో సమన్వయం చేస్తోందని MEA పేర్కొంది. సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు యెమెన్ అధికారులకు భారత ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.

వాణిజ్య నౌకలపై దాడులు ఆగాలి

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని MEA తెలిపింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత, ఎలాంటి ఆటంకాలు లేని నౌకాయానం, వాణిజ్యం కొనసాగేందుకు పరిస్థితులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని స్పష్టం చేసింది.

భారతీయ నావికుల భద్రతపై కేంద్రం దృష్టి

కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనపై స్పందించారు. ఈ ప్రాంతంలో ఉన్న భారతీయ నావికుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ (DGMA)ను ఆదేశించినట్లు తెలిపారు. అన్ని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారతీయ నావికుల భద్రతను నిర్ధారించాలని, రక్షించబడిన సిబ్బందికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

సముద్ర భద్రతపై భారత్ ఆందోళన

వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతను కాపాడటంతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని పక్షాలు తమ అంతర్జాతీయ బాధ్యతలను పాటించాలని MEA పిలుపునిచ్చింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని అమాయక పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే దాడులను భారత్ ఏమాత్రం అంగీకరించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సముద్ర మార్గాల్లో నౌకాయానం స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్యానికి పెరుగుతున్న ముప్పులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.