Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట..

Imran Khan

Imran Khan

Imran Khan Gets Relief: జైలులో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) భారీ ఊరటనిచ్చింది. ఇకపై వారిని ఏకాంత నిర్బంధంలో ఉంచరాదని కోర్టు ఆదేశించింది. అలాగే జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ కలుసుకునేలా అడియాలా జైలు అధికారులు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అవినీతి, సంబంధిత కేసుల్లో వారికి దీర్ఘకాలిక జైలు శిక్షలు విధించబడ్డాయి. ఇమ్రాన్ ఖాన్‌ను ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారంటూ ఆయన సోదరి అలీమా ఖాన్ కోర్టును ఆశ్రయించారు. బుష్రా బీబీ కుమార్తె ముబషారా ఖవర్ మనే కా కూడా ఆమెకు సంబంధించిన అంశంపై పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై తీర్పు వెలువరించిన IHC న్యాయమూర్తి ఖాదిమ్ హుస్సేన్ సోమ్రో.. జైలు నిబంధనల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆయనను కలిసేందుకు అనుమతించాలని ఆదేశించారు. ఆయన కుమారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్‌కు ప్రతిరోజూ వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని కోర్టు ఆదేశించింది. జైలు నిబంధనలకు అనుగుణంగా ఆయనకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు అమలయ్యేలా అడియాలా జైలు సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లోగా అమలు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

2023 నుంచి జైలులోనే ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. తనపై, తన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నేతలపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో భేటీలు, తగిన వైద్య సదుపాయాల విషయంలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని ఇమ్రాన్ మద్దతుదారులు, బంధువులు పదేపదే ఆరోపించారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది. బుష్రా బీబీ 2024 జనవరి 31న అవినీతి సంబంధిత కేసులో శిక్ష పడటంతో తొలిసారి జైలుకు వెళ్లారు. దాదాపు తొమ్మిది నెలల అనంతరం అదే ఏడాది అక్టోబర్ 24న బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే మరో అవినీతి కేసులో శిక్ష అనంతరం 2025 జనవరి 17న ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె అడియాలా జైలులోనే ఉన్నారు. అనంతరం ఆమెపై మరికొన్ని అవినీతి కేసుల్లో కూడా శిక్షలు విధించబడ్డాయి.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై వివాదం
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా కొంతకాలంగా కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది గుర్తించిన కంటి సమస్యపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత నెలలో పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్‌ను ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రికి బదులుగా ప్రైవేట్ నిర్వహణలో ఉన్న షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆగస్టు 20-21 రాత్రి ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా ఆసుపత్రికి తరలించకుండా వైద్య ప్రక్రియ, పరీక్షల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి అడియాలా జైలుకు తరలించారు.

ఈ వ్యవహారంపై ఇమ్రాన్ కుటుంబ సభ్యులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 16న జరిగే తదుపరి విచారణ వరకు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లోని ఆసుపత్రిలోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, అయినప్పటికీ ఆయనను PIMSకు తరలించడం కోర్టు ఆదేశాల ఉల్లంఘన అని వారు వాదించారు. భద్రతా కారణాల వల్లే ఆయనను PIMSకు తరలించాల్సి వచ్చిందని పాకిస్థాన్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ సెప్టెంబర్ 16న ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, కుటుంబ సభ్యులతో భేటీలకు సంబంధించిన పెండింగ్ కేసులను కూడా అదే ధర్మాసనం విచారించనుంది.