Ilhan Omar: అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, పచ్చి భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మైనారిటీల భద్రత పేరుతో దేశంపై విషం చిమ్మింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీలపై పలు సందర్భాల్లో ఒమర్ ఆరోపణలు చేసింది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు పెద్ద మద్దతురాలుగా ఉంది. ఇదిలా ఉంటే, ఆమె మరోసారి భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది.
ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, భారత్లో మైనారిటీలపై వ్యవస్థాగత ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించింది. అమెరికన్ న్యాయవేత్త గ్రెగరీ స్టాంటన్ రూపొందించి. ‘‘10 దశల జెనోసైడ్’’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ.. భారత్లో ‘‘8వ దశ జాతి నిర్మూలన’’ జరుగుతోందని అబద్ధాలను ప్రచారం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వమే కాకుండా, సమాజ స్థాయిలో కూడా ఇది విస్తరిస్తోందని ఆరోపించింది.
అయితే, ఆమె వ్యాఖ్యల్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం ఆమెకు అలవాటే అని చెబుతున్నారు. మైనారిటీ జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ వ్యవస్థల్లో వారి భాగస్వామ్యం వంటి అంశాల్లో మైనారిటీలకు భారత్ సముచిత ప్రాధానత్య ఇస్తుందనే విషయాన్ని మరిచిపోయిన ఇల్హాన్ ఒమర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో మైనారిటీలకు సురక్షితమైన దేశంగా ఉందని చెప్పారు. గత 12 ఏళ్లలో మైనారిటీల జీవన ప్రమాణాలు, అవకాశాలు మరింత మెరుగయ్యాయని ఆయన అన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారత్ జనాభాలో 11 శాతం మైనారిటీలు ఉంటే, ఇప్పుడు ఇది 20 శాతానికి చేరిందని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. ఇల్హాన్ ఒమర్ గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించింది. ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై పలు సందర్భాల్లో భారత్పై విమర్శలు చేసింది. తాజాగా అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమంలో మెన్నెసోటా అటార్నీ జనలర్ కీత్ ఎల్లిసన్, మిన్నెసోటా సెనేట్ నేత ఎరిన్ మర్ఫీ వంటి వారు పాల్గొన్నారు. వీరంతా భారత్లో మైనారిటీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

