NTV Telugu Site icon

Israel Strike On Rafah: రఫా దాడిలో 21 మంది మృతి.. తమ పని కాదన్న ఇజ్రాయిల్..

Gaza War

Gaza War

Israel Strike On Rafah: గాజా స్ట్రిప్‌‌లోని రఫా‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే గాజా నగరంపై దాడి చేసిన ఇజ్రాయిల్, హమాస్ నాయకులుకు రక్షణగా నిలుస్తుందంటూ రఫాపై దాడి చేస్తోంది. మంగళవారం రఫాకు పశ్చిమాన ఉన్న శిబిరాలపై ఇజ్రాయిల్ దాడికి పాల్పడినట్లు, ఇందులో 21 మంది మరణించినట్లు గాజాలోని హమాస్ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉంటే రఫాకు పశ్చిమాన ఉన్న అల్-మవాసిలోని శరణార్థుల శిబిరాలపై తాము ఎలాంటి దాడి చేయలేదని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.

Read Also: Pakistan: భారత్‌తో కుదుర్చుకున్న ‘‘లాహోర్ ఒప్పందాన్ని’’ పాక్ ఉల్లంఘించింది: నవాజ్ షరీఫ్..

ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయిల్ దళాలు ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫా ప్రాంతాన్ని టార్గెట్ చేశాయి. ఈ ప్రాంతంలో ఉన్న హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. అంతకుముందు ఆదివారం జరిగిన దాడిల్లో 45 మంది చనిపోయారు. అయితే, ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో 1200 మందిని చంపేసి, 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 36 వేల మంది అమాయకపు పాలస్తీనియన్లు మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ హమాస్ అంతానికే కట్టుబడి ఉన్నట్లు పలుమార్లు వెల్లడించారు. మరోవైపు ఐర్లాండ్, నార్వే, స్పెయిన్ వంటి యూరప్ దేశాలు పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని అధికారికంగా గుర్తించాయి.