NTV Telugu Site icon

Israel Hezbollah: యాహ్యా సిన్వర్‌ మృతి.. ఇజ్రాయెల్‌పై మండిపడిన హెజ్‌బొల్లా

Hezbolla

Hezbolla

Israel Hezbollah: పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్‌ గ్రూప్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మట్టుపెట్టడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటం తీవ్రతరం చేస్తున్నట్లు హెజ్‌బొల్లా గ్రూప్ వెల్లడించింది. ఇరాన్‌ నుంచి కూడా ఇదే తరహా రియాక్షన్ వచ్చింది. తమ ప్రతిఘటన బలోపేతం అవుతుందని ఐక్యరాజ్య సమితికి ఇరాన్‌ తెలిపింది. పాలస్తీనా విముక్తి కోసం, యువత, చిన్నారులు ముందుకు నడుస్తామని చెప్పుకొచ్చింది. ఆక్రమణ, శత్రుత్వ ధోరణి కొనసాగినంత కాలం ప్రతిఘటన కొనసాగుతుందని.. అమరులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామని హెజ్‌బొల్లా వెల్లడించింది.

Read Also: Take Care Eyes: కంప్యూటర్‌, మొబైల్స్ వాడేవారు కళ్లు జాగ్రత్త.. లేదంటే..

ఇదిలా ఉంటే.. యహ్యా సిన్వర్‌ సోదరుడు మహమ్మద్ పై ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేక దృష్టి పెట్టింది. సిన్వర్‌ సోదరుడితో పాటు ఇతర హమాస్‌ మిలిటరీ కమాండర్ల జాడ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపింది. హమాస్ అధినేత సిన్వర్ మరణం తర్వాత ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఆయుధాలను వదిలి, తమ బందీలను తిరిగి పంపిస్తే.. ఈ యుద్ధం రేపే ముగిస్తుందన్నారు. తమ పౌరులను వదిలిన హమాస్ తీవ్రవాదులకు వారు బయటకు వచ్చి జీవించేలా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. లేకపోతే వేటాడి మరీ హతమరుస్తామని ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.