NTV Telugu Site icon

Hezbollah: ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5000 మందిని చంపాలనుకుంది.. ఈ దాడి మాకు ‘‘భారీ దెబ్బ’’..

Hezbollah Chief Hassan Nasrallah

Hezbollah Chief Hassan Nasrallah

Hezbollah: లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడితో తమ హిజ్బుల్లా గ్రూప్ ‘‘అపూర్వమైన’’ దెబ్బకు గురైందని, హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చివరకు అంగీకరించారు. రెండు రోజుల క్రితం లెబనాన్ వ్యాప్తంగా హిజ్బుల్లా కార్యకర్తలు, మద్దతుదారులు కమ్యూనికేషన్ కోసం వాడుతున్న పేజర్లు పెద్ద ఎత్తున పేలిపోయాయి. లెబనాన్ వ్యాప్తంగా 5000కి పైగా పేజర్లు పేలినట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లలో 37 మంది చనిపోవడంతో పాటు 3000 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడులు ఇజ్రాయిల్ పనే అని, దీని వెనక మొసాద్ హస్తం ఉందని హిజ్బుల్లాతో పాటు దానికి మద్దతు ఇచ్చే ఇరాన్ కూడా ఆరోపించింది. మరోవైపు ఈ దాడులు తామే చేసినట్లు ఇజ్రాయిల్ ఎక్కడా చెప్పుకోలేదు.

Read Also: Namo Drone Didi Scheme: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.8 లక్షల ప్రయోజనం!

లెబనాన్ వ్యాప్తంగా మంగళవారం, బుధవారం జరిగిన దాడులు ఆ దేశ ప్రజల్లో భయాందోళన రేకెత్తించాయి. చివరకు ఏ ఎలక్ట్రానిక్ డివైజ్‌ని అయినా అనుమానంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మాట్లాడుతూ… ఇజ్రాయిల్‌పై తప్పకుండా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఈ దాడుల్ని ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్‌పై కఠినమైన ప్రతీకారం ఉంటుందని, న్యాయమైన శిక్షను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు. ఈ దాడులు ఒక ‘‘ఊచకోత’’ అని యుద్ధ నేరమని లేదా యుద్ధ ప్రకటన కావచ్చని చెప్పాడు. ఇజ్రాయిల్ 2 నిమిషాల్లో 5 వేల మందిని చంపాలన ప్లాన్ చేసిందని ఆరోపించారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరే వరకు ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా పోరాటాన్ని కొనసాగిస్తానని నస్రల్లా ప్రమాణం చేశాడు.