NTV Telugu Site icon

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్.. ప్రాణాలతో ఉండాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు..

Maxresdefault

Maxresdefault

Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కూలిపోయినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరబ్డొల్లాహియాన్‌ కూడా తప్పిపోయారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుస్తోంది. ‘‘మేము ఇంకా ఆశాజనకంగానే ఉన్నాము. అయితే క్రాష్ సైట్ నుంచి వస్తున్న సమాచారం చాలా ఆందోళన కలిగిస్తోంది’’ అని విషయం తెలిసిన అధికారి చెప్పారు. ఆదివారం రోజు హెలికాప్టర్ అజర్ బైజాన్ సరిహద్దు నుంచి తిరిగి వస్తుండగా దట్టమైన పొగమంచు వల్ల పర్వత ప్రాంతాల్లో కూలిపోయినట్లు ఇరాన్ అధికారి రాయిటర్స్‌కి తెలిపారు. మరోవైపు దట్టమైన పొగమంచు సహాయచర్యల్ని క్లిష్టతరం చేస్తోందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

Read Also: PM Modi: మోడీకి ఓటేయొద్దని విద్యార్థులకు చెబుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి అరెస్ట్..

ఇదిలా ఉంటే తమ ప్రియతమ నేత ప్రాణాలతో తిరిగి రావాలని ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ 2021లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ దేశ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత శక్తివంతమైన నేతగా ఆయనకు పేరుంది. ఆదివారం ఉదయం అజర్‌బైజాన్-ఇరాన్ ఉమ్మడి ప్రాజెక్టైన క్విజ్-ఖలైసీ డ్యామ్ ప్రారంభించేందుకు రైసీ అజర్‌బైజాన్ సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.