NTV Telugu Site icon

Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..

Earth

Earth

Earth: విశ్వంలో ప్రతీది ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంది. మనం ఎంత తెలుసుకున్నా అది కేవలం సముద్రంలో నీటి చుక్క మాత్రమే. ఇప్పటికీ మనం నివసిస్తున్న భూగ్రహం గురించిన వివరాలను సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాం. కానీ కొత్త కొత్త ఆవిష్కరణలు మాత్రం మనల్ని అబ్బురపరుస్తూనే ఉంటాయి. తాజాగా ఓ శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. భూమి క్రస్ట్ కింద భారీ సముద్రం దాగి ఉన్నట్లు తెలుస్తోంది.

భూమి ఉపరితలం కింద 700 కి.మీ దిగువన ‘‘రింగ్‌వుడైట్’’ అని పిలువబడే రాతి నిర్మాణంలో నీరు భారీగా నిల్వచేయబడుతోంది. ఈ భూగర్భ జలాశయం, భూమిపై ఉన్న సముద్రాల పరిమాణంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ ఫలితాలు 2014లో ‘డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది లోయర్ మాంటిల్’ అనే శాస్త్రీయ పత్రంలో వివరంగా అందించబడ్డాయి. ఇది రింగ్‌వుడైట్ యొక్క ప్రత్యేక లక్షణాలను కూడా అందించింది.

Read Also: Rahul gandhi: వయనాడ్‌లో రాహుల్ నామినేషన్.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు

‘‘రింగ్‌వుడైట్’’ ఒక స్పాంజి లాంటిది. నీటిని పీల్చుకోవడం, హైడ్రోజన్‌ని ఆకర్షించడానికి, నీటిని ట్రాప్ చేయడానికి అనుమతించేలా రింగ్‌వుడైట్ క్రిస్టల్ నిర్మాణం ఉంటుందని డిస్కవరీ టీమ్‌లోని కీలక సభ్యుడు జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్‌సెన్ చెప్పారు. ‘‘భూమి నీటి చక్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. భూ ఉపరితలంపై నీరు ఎలా వచ్చిందనే దానిని ఇది వివరించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా గుర్తించలేని లోతైన నీటి కోసం వెతుకుతున్నారు’’ అని ఆయన చెప్పారు.

భూకంపాలను అధ్యయనం చేసిన తర్వాత, భూ ఉపరితలం కింద ఉన్న షాక్‌వేవ్‌లను సిస్మోమీటర్ గుర్తించిన తర్వాత పరిశోధకులు ఈ ఆవిష్కరణ చేశారు. “భూమి యొక్క మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ (410- నుండి 660-కిలోమీటర్ల లోతు)లోని ఖనిజాల యొక్క అధిక నీటి నిల్వ సామర్థ్యం లోతైన H2O రిజర్వాయర్ యొక్క అవకాశాన్ని సూచిస్తుంది. ఇది నిలువుగా ప్రవహించే మాంటిల్ నిర్జలీకరణకు కారణమవుతుంది.’’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ట్రాన్సిషన్ జోన్లో వారు ఇంటర్‌గ్రాన్యులర్ మెల్ట్‌ని కనుగొన్నారు. ఈ పెద్ద ట్రాన్సిషన్ జోన్, డీహైడ్రేషన్ మెల్టింగ్ నీటిని ట్రాప్ చేయడానికి పనిచేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.