G7 Summit: రణరంగంగా జెనీవా.. టెస్లా కారు, ఐరాస కార్యాలయానికి నిప్పు

  • రణరంగంగా జెనీవా
  • జీ 7 సదస్సుకు వ్యతిరేకంగా నిరసనలు
  • టెస్లా కారు, ఐరాస కార్యాలయానికి నిప్పు
France

France

జీ 7 సదస్సుకు ముందు స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు అట్టుడికింది. జీ 7 సదస్సుకు వ్యతిరేకంగా వేలాది మంది ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు రణరంగంగా మారి అగ్నిగుండం మారాయి. టెస్లా కారు, ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి నిప్పుపెట్టారు. పరిస్థితులు చేదాటిపోవడంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ఉపయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరగనున్న జీ7 సదస్సుకు వ్యతిరేకంగా సుమారు 20 వేల మంది జెనీవాలో ర్యాలీ నిర్వహించారు. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన ఈ నిరసనలు అనంతరం ఉద్రిక్తంగా మారాయి. పెట్టుబడిదారీ విధానం, బహుళజాతి సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకలుగా భావిస్తున్న సంస్థలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో రోడ్డుపై పార్క్ చేసి ఉన్న టెస్లా కారుకు నిరసనకారులు నిప్పంటించారు. అలాగే ఐరాస కార్యాలయ భవనంపై రాళ్లు విసిరి కిటికీలను ధ్వంసం చేశారు. కొందరు రోడ్లపై ఉన్న ఇటుకలను పీకి పోలీసులపైకి విసిరినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నల్లటి హుడీలు, మాస్కులు, గాగుల్స్ ధరించిన యువకుల గుంపులు నిరసనల్లో చొరబడి మరింత ఉద్రిక్తత సృష్టించాయని అధికారులు పేర్కొన్నారు. కొందరు నిరసనకారులు “ట్రంప్ వ్యతిరేక” బ్యానర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. జీ7 సదస్సులకు వ్యతిరేకంగా ప్రతి ఏడాది ఇలాంటి నిరసనలు జరుగుతూనే ఉంటాయి. పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ, వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈసారి మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సుంకాల విధానం, ఇరాన్ యుద్ధం, వాతావరణ విధానాలు, ఇతర వివాదాస్పద అంశాలపై ట్రంప్ వైఖరిని నిరసనకారులు విమర్శించారు. ఒక నిరసనకారిణి మాట్లాడుతూ.. “ఇది ధనికుల సమావేశం. ధనికులు మరింత ధనవంతులు కావడానికి ఉపయోగపడే వేదికగా జీ7 కనిపిస్తోంది. పేదలు మాత్రం వెనుకబడిపోతున్నారు” అని వ్యాఖ్యానించింది.

జీ7 సదస్సులో ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా దేశాల నేతలు పాల్గొననున్నారు. యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా హాజరవుతారు. మధ్యప్రాచ్య పరిస్థితులు, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్‌తో శాంతి ఒప్పందం, హార్ముజ్ జలసంధి భద్రత వంటి అంశాలు ఈ సదస్సులో ప్రధాన చర్చాంశాలుగా ఉండనున్నాయి. ఇక నిరసనల నేపథ్యంలో జెనీవాలోని అనేక వ్యాపార సంస్థలు తమ దుకాణాలకు రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకున్నాయి. హింస చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో వందలాది మంది అల్లర్ల నిరోధక పోలీసులను అధికారులు మోహరించారు. ప్రస్తుతం నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.