ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్నినో ప్రభావం మరోసారి తీవ్రమైంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేడి అల కారణంగా సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో సుమారు 15 సెంటీమీటర్లు ఎత్తుకు లేచినట్లు నాసా శాటిలైట్ నమోదు చేసింది. ఇదే ఎల్నినో ఏర్పడుతున్న ప్రధాన సంకేతమని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) జూన్ 11న అధికారికంగా ఎల్నినో ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరినాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 63 శాతం ఉందని అంచనా వేసింది.
ఎల్నినో అంటే ఏమిటి?
సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర దిశగా వీచే వాణిజ్య గాలులు ఇండోనేషియా వైపు వేడి నీటిని నెట్టివేస్తాయి. అదే సమయంలో పెరూ తీరంలో సముద్ర గర్భం నుంచి చల్లటి, పోషకాలు అధికంగా ఉన్న నీరు పైకి వస్తుంది. దీనినే అప్వెల్లింగ్ అంటారు. అయితే కొన్నిసార్లు ఈ గాలులు బలహీనపడటం లేదా దిశ మారడంతో పడమరలో పేరుకుపోయిన వేడి నీరు తిరిగి తూర్పు వైపు కదులుతుంది. సముద్ర గర్భంలో ప్రయాణించే ఈ భారీ వేడి నీటి అలను కెల్విన్ వేవ్ అంటారు. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్కు చేరడంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయి.
నాసా శాటిలైట్ ఎలా గుర్తించింది?
2020లో ప్రయోగించిన నాసా-యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త శాటిలైట్ ‘సెంటినెల్-6 మైకేల్ ఫ్రైలిచ్’ ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రపంచ సముద్రాల ఉపరితల ఎత్తును అత్యంత కచ్చితత్వంతో కొలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో మైక్రోనేషియా సమీపంలో చిన్న కెల్విన్ వేవ్ను గుర్తించిన శాటిలైట్.. మార్చి నుంచి మరింత భారీ వేడి అల తూర్పు వైపు కదులుతున్నట్లు నమోదు చేసింది. మే మధ్య నాటికి పెరూ తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణ స్థాయికంటే 15 సెంటీమీటర్ల వరకు పెరిగినట్లు వెల్లడించింది.
సూపర్ ఎల్నినో వచ్చే అవకాశమా?
NOAA అంచనాల ప్రకారం.. ఈసారి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగే అవకాశం 63 శాతం ఉంది. అలా జరిగితే 1997, 2015 సంవత్సరాల మాదిరిగా అత్యంత తీవ్ర ‘సూపర్ ఎల్నినో’ నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
భారత్పై ప్రభావం?
భారత్కు ఎల్నినో సాధారణంగా అనుకూలం కాదు. బలమైన ఎల్నినో పరిస్థితులు ఏర్పడితే నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గి కరవు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలు కొంత మేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఈ పరిణామాలను ప్రపంచ వాతావరణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఏడాది శీతాకాలానికి ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతోంది.

