తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచారు డొనాల్డ్ ట్రంప్.. ఆయన అధ్యక్షుడు అయినా.. ఎప్పుడూ మీడియాపై ఎటాక్ చేస్తూ… సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటూ.. తన అభిప్రాయాలను పంచుకునేవారు.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. సోషల్ మీడియా డొనాల్డ్ ట్రంప్పై నిషేధం విధించింది.. సోషల్ మీడియాలో ఆయన అన్ని ఖాతాలు, ఆయన ప్రధాన అనుచరుల ఖాతాలు కూడా బ్యాన్కు గురయ్యాయి.. అయితే, ఇప్పుడు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు.. త్వరలో కొత్త సోషల్ మీడియా వేదికను ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు. ‘ట్రూత్ సోషల్’ అనే యాప్ ద్వారా మళ్లీ సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ యాప్ను తీసుకురానున్నట్లు సమాచారం.
Read Also: జనవరి 8, శనివారం దినఫలాలు…
కాగా, అమెరికా పార్లమెంటు భవన సముదాయం కేపిటల్ హిల్పై దాడి ఘటనలో డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరమైన ట్రంప్.. ఇప్పుడు తానే కొత్తగా యాప్తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.. ది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) నేతృత్వంలో ట్రూత్ సోషల్ యాప్ పై కసరత్తు జరుగుతోంది.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను పోలి ఉండేలా ఈ యాప్ను రూపొందిస్తున్నారు.. ఇందులోనూ ఒకరినొకరు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది.. ఇక, ట్రెండింగ్లో ఉన్న విషయాలు తెలుసుకునే వీలుకూడా ఉంటుంది. ట్విట్టర్లో పోస్టును ట్వీట్ అని పిలుస్తుండగా.. ట్రూత్ యాప్లో పోస్టును మాత్రం ట్రూత్గా పిలుస్తారట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగి ఓటమిపాలైన ట్రంప్.. ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడిన తర్వాత కూడా ఓటమిని అంగీకరించలేదు.. ఇప్పుడు సోషల్ మీడియా యాప్ తీసుకొస్తున్నారంటే.. దాని వెనుక పెద్ద ప్లానే ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.
