DGCA Ordered SpiceJet To Operate 50 Percent Flights For 8 Weeks: స్పైస్జెట్ ఎయిర్లైన్స్పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈమధ్య వరుసగా ప్రమాదాలు సంభించిన నేపథ్యంలో.. డీజీసీఏ ఆ సంస్థపై ఆంక్షలు విధించింది. 8 వారాల పాటు 50 శాతం మాత్రమే విమాన సర్వీసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే.. 18 రోజుల వ్యవధిలో 8 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే!
కాగా.. గత నెల 19 నుంచి స్పైస్జెట్ విమానాల్లో ఏకంగా 8సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19వ తేదీన 185 ప్రయాణికులతో పాట్నా నుంచి బయలుదేరిన ఓ విమానాన్ని పక్షి ఢీకొనడంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు.. జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ సమస్య తలెత్తింది. అనంతం జూన్ 24, 25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తడంతో.. ఆ రెండు విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేశారు. ఆ మరుసటి రోజే చెన్నై నుంచి కోల్కతా బయలుదేరిన స్పైస్జెట్ కార్గో విమానం వెదర్ రాడార్ పని చేయకపోవడంతో.. అది వెనక్కు వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన ఫ్లైట్లో టేకాఫ్ సమయంలోనే క్యాబిన్లో పొగలు వచ్చాయి.
ఇలా తరచూ ఏదో ఒక లోపం తలెత్తుతుండడంతో.. తొలుత వివరణ ఇవ్వాలంటూ డీజీసీఏ నోటీసులు పంపింది. ఆ వెంటనే మరో సమస్య వెలుగులోకి వచ్చింది. దుబాయ్ – మధురై విమానం బోయింగ్ బి737 మ్యాక్స్ ఫ్రంట్ వీల్ సరిగ్గా పని చేయలేదు. ఈ నేపథ్యంలోనే సీరియస్ అయిన కేంద్రం.. 8 వారాల పాటు కేవలం 50 శాతం విమాన సర్వీసులే నిర్వహించాలంటూ ఆంక్షలు విధించింది. ఇకనుంచైనా స్పైస్జెట్ సీరియస్గా వ్యవహరించి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు ఈ ఆంక్షలు విధించడం జరిగింది.
