ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో హింసతో అట్టుడికింది. ముసుగులు ధరించిన ఆందోళనకారులు చెలరేగిపోయారు కార్లు, నివాసాలను టార్గెట్గా చేసుకుని తగలబెట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు దగ్ధం కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. వలసదారులను లక్ష్యంగా చేసుకుని ఈ అల్లర్లు చెలరేగాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించారు.
ఈ ఘటనలకు సూడాన్ దేశస్థుడే కారణంగా తెలుస్తోంది. కత్తితో వీరంగం సృష్టించాడు. ఒక వ్యక్తిని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీంతో ముసుగు ధరించిన వ్యక్తులు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. కార్లు, ఇళ్లు తగలబెట్టారు. ఇక కత్తిపోటు కేసులో సూడాన్కు చెందిన 30 ఏళ్ల హాది అలోడిడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యాయత్నం కేసులో అతడిని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్కు తరలించింది. ఈ దాడిలో బాధితుడు ఒక కన్ను కోల్పోయినట్లు, ముఖం, వెన్నుపైన తీవ్ర గాయాలు అయినట్లు కోర్టులో వెల్లడైంది.
వైరల్ వీడియోతో ఉద్రిక్తతలు
కత్తిపోటు ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బెల్ఫాస్ట్లో ఉద్రిక్తతలు పెరిగాయి. సోషల్ మీడియా వేదికగా హింసాత్మక నిరసనలకు పిలుపులు రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చిన గుంపులు పలు ప్రాంతాల్లో పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలు, బస్సులకు నిప్పంటించారు. కొన్ని కుటుంబాలు తమ ఇళ్లలో చిక్కుకుపోగా, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుని వారిని సురక్షితంగా బయటకు తరలించారు. అనేక కార్లు పూర్తిగా కాలిపోయాయి. స్థానిక రాజకీయ నాయకులు, మతపెద్దల ప్రకారం దాడులకు గురైన వారిలో ఎక్కువ మంది నల్లజాతీయులు, వలసదారులే ఉన్నట్లు తెలుస్తోంది.
కీర్ స్టార్మర్ ఖండన
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా స్పందిస్తూ. “ప్రజలను వారి జాతి, నేపథ్యం కారణంగా లక్ష్యంగా చేసుకోవడం అస్సలు సహించం. బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్లో వలసదారుల అంశంపై వివాదాలు పెరుగుతున్నాయి. ఆశ్రయం విధానాల కారణంగా ప్రమాదకర వ్యక్తులు దేశంలోకి ప్రవేశిస్తున్నారంటూ కొన్ని ప్రజాహిత, జాతీయవాద పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అదే సమయంలో ఇటీవల జరిగిన మరో హత్యా ఘటన, జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో బెల్ఫాస్ట్లో చోటుచేసుకున్న తాజా హింసాకాండ బ్రిటన్లో వలసదారుల భద్రత, సామాజిక ఐక్యతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.

