NTV Telugu Site icon

Bangladesh: మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రేపు సెలవు దినం రద్దు

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్‌లో నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న దేశ వ్యవస్థాపక పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ మరణాన్ని పురస్కరించుకుని ఇచ్చే సెలవు దినాన్ని తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో షేక్ హసీనాకు, ఆమె మద్దతుదారులకు గట్టి షాక్ తగిలినట్లైంది. 1975లో రెహమాన్ హత్యకు గురైనందున దేశం ఆగస్టు 15న ‘జాతీయ సంతాప దినం’గా పాటిస్తుంది. అయితే ఈ సెలవు దినాన్ని రద్దు చేస్తూ యూనస్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్‌కు వచ్చేసిన తర్వాత నిరసనకారులు రెహమాన్‌కు సంబంధించిన అనేక విగ్రహాలను ధ్వంసం చేశారు. షేక్ హసీనా తండ్రినే షేక్ ముజిబుర్ రెహమాన్.

ఇదిలా ఉంటే ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరుపుకోవాలని షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా మంగళవారం తన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే బంగ్లాదేశ్‌ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరుల ఆత్మలకు శాంతి కలిగేలా ప్రార్థన చేయాలని విజ్ఞప్తి చేశారు. అమెరికాలో నివాసం ఉంటున్న తన కుమారుడి ఎక్స్‌ ఖాతా ద్వారా ప్రజలకు ఆమె సందేశం పంపించారు. కానీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆగస్టు 15న సంతాప దినాన్నే రద్దు చేసింది. దీంతో హసీనాకు గట్టి షాక్ ఇచ్చినట్లే అయింది.

కోటా ఉద్యమం తీవ్ర రక్తపాతం సృష్టించింది. అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు వచ్చేశారు. అనంతరం ఆమె యూకేకు వెళ్లాలని ప్రయత్నం చేశారు.. కానీ అందుకు సాధ్యపడలేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఢిల్లీలోనే బస చేస్తున్నారు. ఇదిలా ఉంటే నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇక హసీనా క్రిమినల్ కేసు కూడా నమోదైంది.