Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..

Cox's Bazar Air Force Base Attack

Cox's Bazar Air Force Base Attack

Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం.

Read Also: Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..?

బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం.. ‘‘కాక్స్ బజార్ వైమానిక స్థావరానికి అనుకుని ఉన్న సమతి పారా నుంచి కొంతమంది నేరస్తులు కాక్స్ బజార్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వైమానిక దళం అవసరమైన చర్యలు తీసుకుంటోంది’’ అని చెప్పింది.

సమాచారం ప్రకారం.. అంతకుముందు రోజు భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది వైమానిక సిబ్బందికి, స్థానిక నివాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రెండు వైపుల గాయాలయ్యాయి. అయితే, అధికారులు మాత్రం ఎంత మంది అన్నది పేర్కొనలేదు. ఈ ఘర్షణలో బాధితుడికి తుపాకీ గాయాలయ్యాయి, కాక్స్ బజార్ జిల్లాలోని సదర్ ఆస్పత్రికి మృతుడిని తీసుకువచ్చారని వైద్య వర్గాలు తెలిపాయి. ఘర్షణకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ సలావుద్దీన్ తెలిపారు.

Exit mobile version