ప్రపంచానికి మానవ హక్కుల గురించి బోధించే అమెరికా..ఇప్పుడు యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇరాన్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. శాంతి, భద్రత పేరుతో క్షిపణులు ప్రయోగించిన అమెరికా.. ఇరాన్లోని స్కూల్ పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకుంది. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణులే అమెరికా దాడులపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది.
ఇరాన్లో జరిగిన రెండు దాడుల్లో కనీసం 177 మంది పౌరులు చనిపోయారని.. ఆ దాడులు విచక్షణతోనే జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవి యుద్ధ నేరాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
మినాబ్లో జరిగిన దాడి మరింత కలచివేసేలా ఉంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన రోజే.. దక్షిణ ఇరాన్లోని మినాబ్ పట్టణంలో షజారెహ్ అనే ప్రైమరీ స్కూల్పై టొమాహాక్ క్షిపణులు పడ్డాయి. అక్కడ స్కూల్ పిల్లలతో నిండిపోయి ఉంది. కొన్ని క్షణాల్లో అంతా మారిపోయింది. 156 మంది ప్రాణాలు పోయాయి. వారిలో 120 మంది పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్ పక్కనే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్కు చెందిన నేవల్ కాంప్లెక్స్ ఉంది.
అదే రోజు ఆ సైనిక ప్రాంతంపైనా దాడి జరిగింది. ఇక అమెరికా దగ్గర టొమాహాక్ క్షిపణులు ఉండటం, అమెరికా సైనిక దర్యాప్తుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం కూడా బయటకు రావడం వంటి అంశాలను చూస్తే ట్రంప్ బలగాలు ఉద్దేశపూర్వకంగానే స్కూల్పై దాడి చేశాయన్నది మొదటి నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అమెరికా మాత్రం దీన్ని అంగీకరించడం లేదు. మినాబ్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతోంది. పౌరులను తాము లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెబుఉతన్నారు. అయితే ఆ దర్యాప్తు ఫలితాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక అదే రోజు లామెర్డ్లోనూ మరో దాడి జరిగింది.
ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్.. దాని చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలు.. అక్కడ జరిగిన దాడిలో కనీసం 21 మంది పౌరులు చనిపోయారు. వారిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. అక్కడ ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్ ఉపయోగించి ఉండొచ్చని యూఎన్ నిపుణులు భావిస్తున్నారు.
ఆ సమయంలో ఆ క్షిపణులు కలిగి ఉన్నది అమెరికా మాత్రమే అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అమెరికా మాత్రం లామెర్డ్పై తాము ఎలాంటి దాడి చేయలేదని చెబుతోంది. అక్కడ ఉపయోగించిన ఆయుధం విషయంలోనూ యూఎన్ అంచనాలను అంగీకరించడం లేదు. ఇక ఇరాన్ ప్రజల పరిస్థితి మరోవైపు మరింత దారుణంగా మారింది. బయట అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతుంటే.. దేశం లోపల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు భారీగా రోడ్డెక్కారు.
2025 డిసెంబర్, 2026 జనవరిలో జరిగిన ఈ నిరసనలను అణచివేసే సమయంలో ఇరాన్ భద్రతా బలగాలు భారీగా ప్రాణాంతక బలాన్ని ఉపయోగించాయని యూఎన్ నిపుణులు చెబుతున్నారు. మొత్తం 31 ప్రావిన్సుల్లో ఈ హింస జరిగినట్టు వారి పరిశీలనలో తేలింది. పైకప్పులపై నుంచి జనాలపై కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు, వైద్య సిబ్బంది, బాధిత కుటుంబాలు చెప్పారు. ఇక గాయపడిన నిరసనకారులను ఆసుపత్రుల్లోనే కొట్టడం, అరెస్ట్ చేయడం జరిగిందని.. వైద్య సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రాణాలు కాపాడుకోవాల్సిన వాళ్లే ఆసుపత్రికి వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది.
అప్పటికే 10వేల మందిని అరెస్ట్ చేశారు. నిర్బంధంలో హింస, న్యాయ సహాయం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. నిరసనలకు సంబంధించిన కేసుల్లో కనీసం 29 మంది పురుషులకు వేగంగా విచారణలు జరిపి మరణశిక్ష అమలు చేశారు. ఈ అణచివేతలో అసలు ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. ఇరాన్ ప్రభుత్వం చెప్పిన సంఖ్య 3,000. కానీ అసలు మరణాల సంఖ్య దీనికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని యూఎన్ నిపుణులు చెబుతున్నారు.
అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ మాత్రం 7,000 మందికి పైగా చనిపోయినట్టు ధృవీకరించామని చెబుతోంది. అంటే ఇరాన్లో సామాన్య ప్రజలకు తప్పించుకునే దారి కూడా లేకుండా పోయింది. బయట నుంచి యుద్ధం..లోపల ప్రభుత్వ అణచివేత.. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మరోవైపు సొంత ప్రభుత్వ బలగాల కాల్పులు. ఈ రెండింటి మధ్య సాధారణ ప్రజలు బలైపోయారు.

