Explainer: పాక్‌తో వేగలేం! పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రజలు భారత్ సాయాన్ని ఎందుకు కోరుతున్నారు?

Pok India Help

Pok India Help

PoK: ఆజాద్ కాశ్మీర్… దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రపంచం ముందు చెప్పుకుంటున్న అబద్ధపు ముసుగు ఇది! కానీ, ఇప్పుడక్కడ ఆ ముసుగు పూర్తిగా తొలగిపోయింది. ‘మాకు పాకిస్తాన్ వద్దు… స్వేచ్ఛ కావాలి’ అంటూ సరిహద్దు అవతల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి వేలాది గొంతులు గర్జిస్తున్నాయి. నిన్నటి వరకు హక్కుల కోసం జరిగిన పోరాటం.. నేడు పాక్ పాలకుల అణచివేతపై తిరుగుబాటుగా మారింది. ఏకంగా ‘భారతదేశం మమ్మల్ని కాపాడాలి’ అంటూ ఒక అగ్రనేత బహిరంగంగా చేసిన ఆర్తనాదం ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏం జరుగుతోంది?

అమన్ ఖాన్ ఏం అన్నారు?

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం, పాలకులు సాగిస్తున్న అణచివేత పరాకాష్టకు చేరింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ-JAAC నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. జూన్ 30న రావాలాకోట్‌లోని ఈద్గా గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. “మాకు రేషన్ కొరత ఉంది.. మందులు లేవు.. ఆహారం లేదు.. మాకు భారతదేశం సాయం కావాలి” అంటూ అమన్ ఖాన్ బహిరంగంగానే భారత్‌ను అర్ధించారు.

ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేపై ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందని, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే, సరిహద్దుల వెంట ఉన్న పూంచ్, డోడా సెక్టార్ల ద్వారా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సభకు హాజరైన వేలాది మంది ప్రజలు “ఎల్ఓసీ వైపు కదులుదాం” అంటూ పెద్దఎత్తున నినదించడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మాకు స్వేచ్ఛ కావాలంటూ నినాదాలు:

PoKలో ఈ ఉద్రిక్తతలు తలెత్తడానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. పీఓకేలో ప్రజల పక్షాన హక్కుల కోసం ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ దశాబ్దాలుగా పోరాడుతోంది. అయితే పాకిస్తాన్ పాలకులు జూన్ 5న JAACని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ నిషేధం విధించారు. స్థానిక సంస్థలపై, ప్రజలపై తమ పట్టు కోల్పోతామనే భయంతో ఇస్లామాబాద్ చేసిన ఈ దుశ్చర్య పీఓకేలో దావాగ్నిని రగిల్చింది. నిరసనకారులపై పాక్ భద్రతా దళాలు విచక్షణారహితంగా మారణాయుధాలు ఉపయోగించడంతో, ఇప్పటివరకు డజన్ల కొద్దీ అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రావాలాకోట్ ఈద్గా గ్రౌండ్‌లో జరిగిన ర్యాలీలో “పీఓకే పాకిస్తాన్‌లో భాగం కాదు”, “మాకు స్వేచ్ఛ కావాలి” అంటూ ప్రజలు చేసిన నినాదాలు, ఇది కేవలం సంస్కరణల కోసం సాగుతున్న ఉద్యమం కాదని, పాక్ విముక్తి కోసం జరుగుతున్న పోరాటమని స్పష్టం చేస్తున్నాయి.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్- ICPS ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, పీఓకేతో పాటు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్- PoGBలో కూడా దశాబ్దాలుగా ఒకే రకమైన రాజకీయ మోసం సాగుతోంది. ఇస్లామాబాద్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటే, పీఓకే ఎన్నికల్లో కూడా అదే పార్టీ విజయం సాధించడం ఇక్కడి ఆనవాయితీగా మారింది. ఇది కాకతాళీయం కాదు, ముమ్మాటికీ పాక్ మిలిటరీ, పాలకుల వ్యూహాత్మక రిగ్గింగ్ అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అక్కడి స్థానిక ప్రాంతీయ ప్రభుత్వాలు కేవలం ఇస్లామాబాద్ చేతిలో కీలుబొమ్మలుగా మిగిలిపోయాయి. స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయకుండా తొక్కిపెడుతూ, పాకిస్తాన్ లోని ప్రధాన పార్టీలే దశాబ్దాలుగా ఇక్కడి అధికారాన్ని నియంత్రిస్తూ వస్తున్నాయి.

భారత విభజన సమయం నుండి పాకిస్తాన్ పీఓకే ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా తన కబ్జాలో ఉంచుకున్నప్పటికీ, అక్కడి ప్రజలకు కనీస హక్కులను కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. VO: దశాబ్దాలుగా వనరులను దోచుకుంటూ, స్థానిక స్వరాజ్యాన్ని హరిస్తూ వస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రస్తుతం అక్కడ సాగుతున్న సైనిక చర్యలు, JAACపై విధించిన నిషేధం.. ఎదురుతిరుగుతున్న ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడానికి పాక్ మిలిటరీ పన్నుతున్న వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తే, తమకు “ఇతర మార్గాలు కూడా ఉన్నాయి” అంటూ అమన్ ఖాన్, పాక్ పాలకులను హెచ్చరించడం భవిష్యత్తులో రాబోయే పెద్ద తిరుగుబాటుకు సంకేతం.

ఇస్లామాబాద్ పాలకుల ఇనుప బూట్ల కింద నలిగిపోతున్న పీఓకే ప్రజల సహనానికి ఇప్పుడు హద్దులు దాటాయి. బుల్లెట్లకు భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ పాక్ గుప్పిట్లో బతకలేమని అక్కడి జనం తేల్చి చెబుతున్నారు. స్వయంగా పీఓకే అగ్రనేతే భారత్ సహాయాన్ని అర్ధించడం, ఎల్ఓసీ బోర్డర్లు తెరవాలని కోరడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు.

: CLN RAJU (EDITOR- NTV DIGITAL)