Explainer: ‘నెతన్యాహును భూస్థాపితం చేస్తాం..’ ఇది శవయాత్ర కాదు.. ఇరాన్ రణగర్జన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియల క్రతువు ఇప్పుడు టెహ్రాన్లో జరుగుతోంది. నాలుగు నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన ఇరాన్ అగ్రనాయకత్వం అంతా ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ పెద్దఎత్తున గర్జించింది. అమెరికా, ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను భూస్థాపితం చేస్తామంటూ లక్షలాది మంది గొంతుకలు గర్జించాయి. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటాయనే భయాలు నెలకొన్నాయి.
రాజకీయ ప్రదర్శనగా మారిన ఖమెనీ అంత్యక్రియలు:
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో 86 ఏళ్ళ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం కారణంగా నాలుగు నెలల పాటు ఆలస్యమైన ఖమేనీ అంత్యక్రియలు.. ఇప్పుడు టెహ్రాన్ వేదికగా ఒక రాజకీయ ప్రదర్శనగా మారాయి.
వారం రోజుల పాటు సాగే ఈ క్రతువులో.. కేవలం ఖమేనీ భౌతికకాయమే కాదు, ఆయన కుమార్తె జహ్రా హద్దాద్ అదెల్, 14 నెలల వయసున్న మనవరాలు జహ్రా మొహమ్మది గోల్పాయిగాని శవపేటికలు కూడా ఉంచారు. ఆ చిన్నారి శవపేటికను చూసి టెహ్రాన్ ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రార్థనలకు ముందు వేదికపై నిలబడిన కవి మహ్మద్ రసౌలి మైకులో గర్జించారు. “ఇకపై మా కఫనమే మా వస్త్రం.. ట్రంప్ను అంతం చేయడం మా బాధ్యత. మా ఇమామ్ను చంపినవాడు ఇంకా బతికే ఉండటం ప్రపంచానికే అవమానం” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడి లక్షలాది మందిని రెచ్చగొట్టాయి. సామాన్యులు సైతం ట్రంప్ను హతమార్చడమే తమ ఏకైక లక్ష్యమని బాహాటంగా ప్రకటిస్తున్నారు.
Also Read
ఇజ్రాయెల్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే నిఘా హెచ్చరికల నడుమ.. ఇరాన్ అగ్రనాయకత్వం, మిలిటరీ కమాండర్లు ఒకేసారి బహిరంగంగా ప్రత్యక్షం కావడం రక్షణ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, అమెరికాతో చర్చలు జరుపుతున్న పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఖలీబాఫ్, రెవల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్ అధిపతి ఎస్మాయిల్ ఖానీ, ఇప్పటివరకు ప్రపంచ కంటికి కనబడని జనరల్ అహ్మద్ వాహిదీలు ఈ వేదికపై ఫొటోలకు చిక్కారు. కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సోదరులు మసౌద్, మీసమ్, ముస్తఫాలు కూడా ఇక్కడే కనిపించారు. అయితే, తన తండ్రి మరణించిన వైమానిక దాడిలో గాయపడి, ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్న కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం ఈ వేడుకకు హాజరుకాకుండా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. 97 ఏళ్ళ వృద్ధ షియా మతగురువు అయతోల్లా జాఫర్ సోభానీ నేతృత్వంలో ఈ ప్రార్థనలు జరిగాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కోసం పట్టు:
ఖమేనీ అంత్యక్రియల వెనుక కేవలం మతపరమైన సెంటిమెంట్ మాత్రమే లేదు… దీని వెనుక అంతర్జాతీయ ఇంధన రాజకీయాల వ్యూహం దాగి ఉంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’పై పూర్తి నియంత్రణ సాధించాలని ఇరాన్ పట్టుబడుతోంది. యుద్ధ సమయంలో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. అయితే అమెరికా ఈ డిమాండ్ను పూర్తిగా తిరస్కరించింది. గడిచిన 72 గంటల్లోనే అమెరికా నేవీ పర్యవేక్షణలోని నౌకాదళం ఈ జలసంధి గుండా 70 నౌకల ప్రయాణానికి సహకరించింది.. ఇందులో 18 నౌకలు శనివారం నాడే ప్రయాణించాయి. ఓమన్, ఇరాన్ తీరాల్లో నౌకా రవాణా సాధారణ స్థితికి వస్తున్నప్పటికీ, మైన్ క్లియరెన్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమం, లెబనాన్లోని హిజ్బుల్లాకు ఇరాన్ ఇస్తున్న మద్దతుపై అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఇంకా ప్రతిస్తంభనలోనే ఉన్నాయి.
ఖమేని అంత్యక్రియలను ఇరాన్ కేవలం ఒక సంప్రదాయ, సాధారణ కార్యక్రమంగా చూడడం లేదు. దీనిని అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో భాగంగా చూస్తోంది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాఘెర్ జోల్ఘాదర్ ప్రకటించినట్లు.. ఇరాన్ ప్రజలు ఇప్పుడు కేవలం రెండు నినాదాలతోనే ముందుకు వెళ్తున్నారు.. ఒకటి ప్రతిఘటన, రెండు ప్రతీకారం. టెహ్రాన్ వీధుల్లో సోమవారం ప్రారంభం కానున్న ఈ శవయాత్ర.. ఇరాన్ అంతటా సాగనుంది. ఇరాక్ సరిహద్దుల వరకు వెళ్లి, ఖమేనీ జన్మస్థలమైన మషద్లోని ఇమామ్ రెజా మందిరంలో గురువారం అంత్యక్రియలతో ముగియనుంది. ఈ లోగా దేశంలో ఎయిర్స్పేస్, రోడ్డు మార్గాలు పూర్తిగా మూసేయాలని నిర్ణయించారు. అమెరికా డిమాండ్లకు లొంగేది లేదని, శాశ్వత సంధి కుదరాలంటే తమ షరతులకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ ఈ శవయాత్రను ఒక అంతర్జాతీయ దౌత్య ఆయుధంగా వాడుకుంటోంది.
ఇరాన్ ఆక్రోశం వెనుక కేవలం ఒక నాయకుడి మరణం మాత్రమే లేదు.. దశాబ్దాల నాటి అమెరికా వ్యతిరేకత, ఇజ్రాయెల్ పై ఉన్న పగ దాగి ఉన్నాయి. ఏప్రిల్లో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసి, మళ్ళీ పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది కేవలం మధ్యప్రాచ్యానికే పరిమితం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, చమురు మార్కెట్ను శాసిస్తున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను అతలాకుతలం చేస్తుంది.
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
తాజావార్తలు
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!