Explained: యుద్ధం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మరణాలు.. కూలిపోయిన భవనాలు.. రక్తపాతం.. శరణార్థులు..! అయితే యుద్ధం మరో ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది. అది బయటికి కనిపించదు, వినిపించదు.. చుక్క రక్తం కూడా కారదు. కానీ ఆ సమస్య జీవితాంతం వెంటాడుతుంది. అదే వినికిడి కోల్పోవడం.
2023 అక్టోబర్ 7 నుంచి గాజాలో కొనసాగుతున్న యుద్ధం వేలాది మంది పిల్లల జీవితాలను తలకిందులు చేసింది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2026నాటికే 21వేల మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 33వేలమందికిపైగా పిల్లలు గాయపడ్డారు. అయితే ఇప్పుడు వైద్య నిపుణులు మరో భయంకరమైన సంక్షోభం గురించి హెచ్చరిస్తున్నారు. పేలుళ్ల కారణంగా పిల్లల్లో వినికిడి శక్తి వేగంగా దెబ్బతింటోందని చెబుతున్నారు.
గాజా పిల్లల్లో వినికిడి లోపాలకు కారణమేంటి?
యుద్ధానికి ముందు గాజాలో వినికిడి లోపాలతో జీవిస్తున్న వారి సంఖ్య సుమారు 20 వేలు ఉందని అంచనా. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య 30 వేల నుంచి 40 వేల మధ్యకు పెరిగిందని స్థానిక పునరావాస సంస్థలు చెబుతున్నాయి. ఇందులో భారీ సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. నిజానికి శరీరానికి గాయాలు కాకపోయినా వినికిడి శక్తి కోల్పోడానికి ప్రధాన కారణం బ్లాస్ట్ వేవ్స్. అంటే ఒక బాంబు పేలినప్పుడు కేవలం శబ్దం మాత్రమే ఉత్పత్తి కాదు. అపారమైన శక్తితో కూడిన ఒత్తిడి తరంగాలు చుట్టుపక్కల వ్యాపిస్తాయి. ఈ తరంగాలు క్షణాల్లో మన చెవిలోని అత్యంత సున్నితమైన హెయిర్ సెల్స్ను దెబ్బతీస్తాయి. ఇవే శబ్దాలను మెదడుకు పంపించే ప్రధాన వ్యవస్థ. ఒకసారి ఈ కణాలు నాశనమైతే సహజంగా తిరిగి పెరగవు. దీనికారణంగా శాశ్వత వినికిడి నష్టం ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
అంతేకాదు బ్లాస్ట్ వేవ్స్ చెవులకే పరిమితం కావు. అవి మెదడుపై కూడా ప్రభావం చూపుతాయి. అనేక పరిశోధనల ప్రకారం భారీ పేలుళ్లకు గురైన పిల్లల్లో ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, యాంగ్జైటీ, భయం, నిద్రలేమి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాంటి మానసిక సమస్యలు కూడా కనిపిస్తాయి. గాజాలోని అనేక కుటుంబాలు ఇప్పుడు ఇదే వాస్తవాన్ని ఎదుర్కొంటున్నాయి.
పేలుడు జరిగిన కొన్ని రోజుల తర్వాత తమ పిల్లలు పిలిచినా స్పందించడం లేదని తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. మాట్లాడినా తిరిగి చూడడం లేదు. శబ్దాలకు స్పందించడం లేదు. పరీక్షలు చేయించుకున్న తర్వాతే అసలు సమస్య బయటపడుతోంది. ఇటు వైద్యులు మరింత ఆందోళన కలిగించే విషయాలు చెబుతున్నారుజ
కోక్లియర్ ఇంప్లాంట్ చేయించాలా?
చిన్న పిల్లల్లో వినికిడి అనేది కేవలం శబ్దం వినడానికే కాదు. భాష నేర్చుకోవడానికి, మాటలు మాట్లాడడానికి, సామాజిక సంబంధాలు పెంచుకోవడానికి, మెదడు అభివృద్ధి చెందడానికి కూడా అత్యంత కీలకం. ముఖ్యంగా పుట్టిన తర్వాత మొదటి ఐదేళ్లు భాషా అభివృద్ధికి చాలా కీలకం. ఈ సమయంలో పిల్లలు మాటలు వినలేకపోతే వారి మెదడు భాషను నేర్చుకునే అవకాశాన్ని క్రమంగా కోల్పోతుంది. అందుకే వైద్యులు కోక్లియర్ ఇంప్లాంట్ లాంటి చికిత్సలను వీలైనంత త్వరగా చేయాలని సూచిస్తున్నారు. కానీ గాజాలో పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. యుద్ధం కారణంగా ఆసుపత్రులు దెబ్బతిన్నాయి. పునరావాస కేంద్రాలు మూతపడ్డాయి. స్పీచ్ థెరపీ సేవలు తగ్గిపోయాయి. వినికిడి యంత్రాలు, బ్యాటరీలు, కోక్లియర్ ఇంప్లాంట్ పరికరాల కొరత తీవ్రంగా ఉంది. వేలాది మంది పిల్లలకు అవసరమైన వైద్య సహాయం అందడం లేదు.
ఇక్కడ మరో ప్రమాదం కూడా ఉంది. సాధారణంగా మనం ప్రమాదాన్ని కళ్లతో చూస్తాం అనుకుంటాం. కానీ యుద్ధ ప్రాంతాల్లో ప్రమాదాన్ని ముందుగా చెవులే గుర్తిస్తాయి. విమానం వస్తున్న శబ్దం. పేలుడు హెచ్చరిక. ఖాళీ చేయాలనే పిలుపు. దగ్గరపడుతున్న వాహనం. ఇవన్నీ వినికిడి ద్వారానే తెలుస్తాయి. కానీ వినికిడి కోల్పోయిన పిల్లలు ఈ హెచ్చరిక వ్యవస్థను పూర్తిగా కోల్పోతున్నారు. అప్పుడు వారి ప్రాణాపాయం మరింత పెరుగుతోంది.
అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధ ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగ పిల్లలు సాధారణ పిల్లల కంటే ఎక్కువ ప్రమాదాలను ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా వినికిడి లోపం ఉన్న పిల్లలు సామాజికంగా ఒంటరైపోవడం, విద్యకు దూరమవడం, మానసిక ఒత్తిడికి గురికావడం ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నాయి. వాస్తవానికి ఒక పిల్లాడు వినికిడి కోల్పోతే కేవలం ఒక ఇంద్రియాన్ని మాత్రమే కోల్పోవడం కాదు కదా.. అతను భాషను కోల్పోయే ప్రమాదంలో కూడా పడతాడు. సంభాషణను కోల్పోతాడు. సమాజంతో అనుబంధాన్ని కోల్పోతాడు. కొన్నిసార్లు తన బాల్యాన్నే కోల్పోతాడు.
యుద్ధం ముగిసిన తర్వాత కూలిపోయిన భవనాలను మళ్లీ నిర్మించవచ్చు. రోడ్లను మళ్లీ నిర్మించవచ్చు. కానీ ఒక చిన్నారి కోల్పోయిన వినికిడిని తిరిగి తీసుకురావడం అంత ఈజీ కాదు. అందుకే గాజాలోని వేలాది మంది పిల్లలకు ఇప్పుడు అత్యవసరంగా అవసరమైనది కేవలం శాంతి మాత్రమే కాదండి. సమయానికి అందే వైద్య సహాయం కూడా..!

