Vijayawada Crime: చనిపోతానంటూ బెదిరించి ఓ యువతి నుంచి విడతల వారీగా ఏకంగా రూ.1.38 కోట్లు వసూలు చేసిన వ్యక్తిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు విజయవాడ సూర్యారావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, హైదరాబాద్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత యువతికి మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు స్నాప్చాట్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినని, అమలాపురం సమీపంలోని అంబాజీపేట తన స్వగ్రామమని అతను ఆమెకు చెప్పినట్లు సమాచారం. పరిచయం పెరగడంతో ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది జూన్లో ఇద్దరూ కలిసి కోయంబత్తూరుకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
కోయంబత్తూరులో ఉన్న సమయంలో గౌతంనాయుడు తాను ఆన్లైన్ క్రిప్టో కరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఆ మొత్తం బ్లాక్ అయిందని యువతికి చెప్పాడు. అత్యవసరంగా డబ్బులు అవసరమని కోరడంతో ఆమె లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రూ.10.42 లక్షలు అతనికి ఇచ్చింది. ఆ తర్వాత కూడా డబ్బులు కావాలని గౌతంనాయుడు కోరగా, తన వద్ద ఇక డబ్బులు లేవని యువతి స్పష్టం చేసింది. దీంతో డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ అతను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంటున్నట్లు ఫొటో తీసి వాట్సాప్లో పంపినట్లు తెలిపింది.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి ఈ విషయం తల్లికి కూడా చెప్పకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టింది. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు గౌతంనాయుడికి ఇచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ అతను మరిన్ని డబ్బులు కావాలంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. చివరకు వేధింపులు, బెదిరింపులు భరించలేక యువతి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి నుంచి నగదు ఏ విధంగా తీసుకున్నాడు, మొత్తం లావాదేవీల వివరాలు, నిందితుడి ఆర్థిక కార్యకలాపాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

